పుల్కల్, వెలుగు: సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం హోన్నాపూర్ గ్రామ సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ బాలిక చనిపోగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఎస్సై విశ్వజన్ తెలిపిన వివరాల ప్రకారం.. సదాశివపేట మండలంలోని పెద్దాపూర్ గ్రామానికి చెందిన బూర్ర వైష్ణవి(13) రెండు రోజుల కింద పుల్కల్ మండలం మిన్పూర్ గ్రామంలోని అమ్మమ్మ ఇంటికి వచ్చింది.
ఆదివారం వైష్ణవిని పెద్దాపూర్ గ్రామానికి ఆమె మేనమామ కాసాల భాస్కర్, కూతురు రమ్యశ్రీతో కలిసి బైక్ పై తీసుకెళ్తున్నాడు. హోన్నాపూర్ శివారులో జోగిపేట వైపు నుంచి సంగారెడ్డి వెళ్తున్న ఆర్టీసీ బస్సు బైక్ను వెనుక నుంచి ఢీకొట్టగా, ముగ్గురు కింద పడిపోయారు. వైష్ణవి తలపై నుంచి బస్ టైర్ పోవడంతో అక్కడిక్కడే చనిపోయింది. బాస్కర్, రమ్యశ్రీకి స్వల్ప గాయాలయ్యాయి. భాస్కర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
