
తాను పార్టీ మారుతున్నట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని మునుగోడు కాంగ్రెస్ నేత పాల్వాయి స్రవంతి ఖండించారు. ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు. తనంటే పడనివారు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను కాంగ్రెస్ లోనే ఉంటానని చెప్పిన స్రవంతి. దయచేసి ఆ ప్రచారాన్ని నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. తనని నమ్మిన కార్యకర్తలకు తాను మోసం చేయనని తెలిపారు. మునుగోడు కాంగ్రెస్ అభిమానులు, కార్యకర్తలు, నాయకులంతా తన కుటుంబమే అన్న స్రవంతి.. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసమే కృషి చేస్తానని వెల్లడించారు. వలస వాదులే అవకాశాలకు లొంగిపోతారని, పదవి, డబ్బు వ్యామోహం వల్ల వేరే పార్టీలోకి వెళ్లిన వారితో తనను పోల్చొద్దని తెలిపారు. కాగా మునుగోడుకు చెందిన మరో కాంగ్రెస్ నేత చలమల కృష్ణారెడ్డి బీజేపీలో చేరారు.