
భద్రాచలం, వెలుగు : భద్రాచలం సీతారామచంద్రస్వామికి ఆదివారం గర్భగుడిలో మూల విరాట్ కు పంచామృతాభిషేకం జరిగింది. సుప్రభాత సేవ అనంతరం భక్తుల సమక్షంలో వేదమంత్రోచ్ఛరణల మధ్య ఆవు పాలు, నెయ్యి, పెరుగు, తేనె, పంచదారలతో పంచామృతాభిషేం చేశారు. పసుపు ముద్దలను మూల విరాట్ కు అద్ది స్నపన తిరుమంజనం నిర్వహించి భక్తులకు మంజీరాలను పంపిణీ చేశారు. ఆ తర్వాత అలంకరించి విశేష హారతులు ఇచ్చాక బంగారు పుష్పాలతో అర్చన చేశారు. భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.