నిర్మల్ జిల్లాలో ఏసీబీకి పట్టుబడిన పంచాయతీ సెక్రటరీ

నిర్మల్ జిల్లాలో ఏసీబీకి పట్టుబడిన పంచాయతీ సెక్రటరీ

కడెం, వెలుగు: నిర్మల్  జిల్లా దస్తురాబాద్  మండలం గొడిసెర్యాల్ గ్రామ పంచాయతీ కార్యదర్శి ఏసీబీకి చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ మధు తెలిపిన వివరాల ప్రకారం.. గొడిసెర్యాల్  గ్రామానికి చెందిన ఓ వ్యక్తి వాటర్​ ప్లాంట్​ ఏర్పాటు కోసం ఎన్​వోసీకి దరఖాస్తు చేసుకున్నాడు. ఎన్​వోసీ కోసం గ్రామ కార్యదర్శి శివకృష్ణను సంప్రదించగా, రూ.15 వేలు డిమాండ్​ చేశాడు. రూ.12 వేలకు ఒప్పందం చేసుకున్న బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనలను మేరకు మంగళవారం ఉదయం గ్రామంలోని పల్లె ప్రకృతి వనం వద్ద శివకృష్ణకు రూ.12 వేలు ఇవ్వగా, ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అతడిని అదుపులోకి తీసుకొని పంచాయతీ కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శిని అరెస్ట్​ చేసి కోర్టులో హాజరు పర్చనున్నట్లు ఏసీబీ డీఎస్పీ తెలిపారు.