మా జీతాలిస్తరా..ఇయ్యరా?.. పంచాయతీ కార్మికుల ఆందోళన

మా జీతాలిస్తరా..ఇయ్యరా?.. పంచాయతీ కార్మికుల ఆందోళన

గ్రామ పంచాయతీ కార్మికులకు ప్రభుత్వం పెంచిన రూ.8500 జీతాలు ఇవ్వాలని గ్రామ పంచాయతీ  ఎంప్లాయీస్ అండ్​ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు పాలడుగు భాస్కర్ డిమాండ్ చేశారు. శుక్రవారం హిమాయత్​నగర్ లోని పంచాయతీ రాజ్ కమిషనర్ ఆఫీసు  ముందు  సుమారు వెయ్యి మంది కార్మికులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా భాస్కర్​ మాట్లాడుతూ ఐదేండ్లుగా జీతాలు పెంచాలని ధర్నాలు, సమ్మెలు చేస్తుంటే జీవో విడుదల చేసి ప్రభుత్వం చేతులు దులుపుకుందన్నారు. కాని ఏ ఫండ్స్​ నుంచి ఇవ్వాలో స్పష్టత ఇవ్వలేదన్నారు. గతంలో మాదిరిగా కేటగిరి విధానాన్ని కొనసాగించటంతో పాటు మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులను సర్పంచ్ లు అక్రమంగా తొలగిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్కే డే పేరిట ప్రవేశపెట్టిన ఇన్సూరెన్స్​ను ప్రభుత్వమే  చెల్లించాలని కోరారు. కార్మికులతోని బాండ్ పేపర్ రాయించుకునే పద్ధతిని ఆపాలని డిమాండ్ చేశారు. ఆందోళన అనంతరం  పంచాయతీ రాజ్ కమిషనర్ రఘునందన్ రావును భాస్కర్ నేతృత్వంలోని పలువురు ప్రతినిధులు కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలు డిమాండ్లపై ఆయన సానుకూలంగా స్పందించారు.  రాష్ట్ర అధ్యక్షుడు గణపతి రెడ్డి, ప్రధాన కార్యదర్శి చాగంటి వెంకటయ్య పాల్గొన్నారు.