పరకాల ఎమ్మెల్యేపై సొంత పార్టీ మహిళా నేత ఆరోపణలు : భూమిని కబ్జా చేశారని ఆవేదన

పరకాల ఎమ్మెల్యేపై సొంత పార్టీ మహిళా నేత ఆరోపణలు : భూమిని కబ్జా చేశారని ఆవేదన

పరకాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిపై సొంత పార్టీ మహిళా కార్యకర్త తీవ్ర ఆరోపణలు చేశారు. తమ 25 ఎకరాల భూమిని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆక్రమించుకున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే, ఆయన మనుషుల నుంచి తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

జున్ను సంతోష తెలిపిన వివరాల ప్రకారం.. 

పరకాల నియోజకవర్గంలోని ఆత్మకూరు మండలం గుడేస్పాడు గ్రామ చెరువు శిఖంలోని సర్వే నెంబర్ 731లో తమకు సుమారు 25 ఎకరాల( లావణి పట్టా వ్యవసాయ భూమి) భూమి ఉందని బీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాలు జున్ను సంతోష చెప్పారు. 25 ఎకరాల భూమి తమ ఉమ్మడి కుటుంబానికి చెందినదని తెలిపారు. అయితే.. తమ కుటుంబానికి చెందిన 25 ఎకరాల వ్యవసాయ భూమిని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారని సంతోష ఆరోపించారు. హైదర్ గూడ ఎన్ఎస్ఎస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చల్లా ధర్మారెడ్డిపై సంతోష తీవ్ర ఆరోపణలు చేశారు. 

ఎమ్మెల్యే ధర్మారెడ్డి తన అనుచరుల ద్వారా తమపై భౌతిక దాడులకు పాల్పడుతున్నారని, భూమిలో అడుగు పెడితే చంపేస్తామని బెదిరిస్తున్నారని సంతోష ఆరోపించారు. మూడున్నర ఎకరాల్లో మొక్కజొన్న పంట వేస్తే.. మొత్తం దోచుకుపోయారని, ప్రశ్నించిన తనను విపరీతంగా కొట్టారని ఆరోపించారు. ఇదే విషయంపై ఏప్రిల్ 28వ తేదీన ఆత్మకూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశానని చెప్పారు. పోలీసులు ఎమ్మెల్యేకు మద్దతుగా కాగితాలపైన సంతకాలు చేయించుకునే ప్రయత్నం చేశారని చెప్పారు. 

ఆత్మకూరు ఎస్ఐ, సీఐలను వెంటనే సస్పెండ్ చేయాలని సంతోష డిమాండ్ చేశారు. ఈ అంశంపై జిల్లా కలెక్టర్ కు కూడా ఫిర్యాదు చేశానన్నారు. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి నుంచి తనకు, తమ కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని భయాందోళన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, రాష్ట్ర డీజీపీ ఈ విషయంలో జోక్యం చేసుకుని, కబ్జాకు గురైన తమ భూమిని తిరిగి ఇప్పించాలని సంతోష విజ్ఞప్తి చేశారు.