
- 61 ఫిర్యాదులు స్వీకరించిన అడిషనల్ డైరెక్టర్
హైదరాబాద్ సిటీ, వెలుగు: వరద కాలువలు, చెరువులు, రోడ్లు, పార్కుల స్థలాల ఆక్రమించారంటూ పలువురు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. సోమవారం హైడ్రా ప్రజావాణికి 61 ఫిర్యాదులందాయి. వీటిని హైడ్రా అడిషనల్ డైరెక్టర్ వర్ల పాపయ్య పరిశీలించారు. శేరిలింగంపల్లి మండలం కండాపూర్లోని రాఘవేంద్ర షెల్టర్స్ కాలనీకి చేరువగా ఉన్న ప్రెస్టిన్ ఐవీవై అపార్ట్మెంట్స్ ఎదురుగా ఉన్న 40 అడుగుల రోడ్డును అక్కడివారు మూసి వేశారని స్థానికులు ఫిర్యాదు చేశారు.
కుత్బుల్లాపూర్ మండలం గాజుల రామారంలోని సర్వే నంబరు 307/1, 308/2,3,5లో ఉన్న ప్రభుత్వ స్థలం కబ్జాకు గురైందని స్థానికులు ఫిర్యాదు చేశారు. గతంలో ఎపీఎస్ఎఫ్సీకి చెందిన ఈ భూమిని తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తీసుకోగా, అక్కడ కబ్జాదారులు ఆక్రమిస్తున్నారని ఫిర్యాదుదారులు పేర్కొన్నారు.
కొంపల్లి మున్సిపాలిటీ, దూలపల్లి విలేజ్ ఇండస్ట్రియల్ ఏరియాలో 1967లో 157 ఎకరాల్లో 1696 ప్లాట్లతోవేసిన లేఅవుట్ ప్రకారం 4 పార్కులుండాలని, కానీ, రెండు పార్కులు ఫాక్స్ సాగర్ ఎఫ్టీ ఎల్ పరిధిలో ఉన్నట్టు నిర్ధారణ అయిందన్నారు. మరో రెండు పార్కులు ఆ లేఅవుట్ వేసిన వారి వారసులే కబ్జా చేశారని కాలనీ సంక్షేమ సంఘ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు.
బల్దియా, కలెక్టరేట్లకు..
జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసుతో పాటు జోనల్ ఆఫీసుల్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమాలకు 170 ఫిర్యాదులు వచ్చాయి. హెడ్ ఆఫీసులో 72, ఆరు జోన్లలో 98 ఫిర్యాదులు వచ్చాయి. హెడ్ ఆఫీసులో అడిషనల్ కమిషనర్లు వేణుగోపాల్, సత్యనారాయణ, గీతా రాధిక పంకజ, అలివేలు మంగతాయారు లతో కలిసి అడిషనల్ కమిషనర్ రఘుప్రసాద్ ఫిర్యాదులను స్వీకరించారు. హైదరాబాద్ కలెక్టరేట్ ప్రజావాణికి 129 ఫిర్యాదులు రాగా, ఇందులో ఇందిరమ్మ ఇండ్ల కోసమే 52 ఆర్జీలు వచ్చాయని అడిషనల్కలెక్టర్లు ముకుంద రెడ్డి, కదిరవన్ తెలిపారు.
వికారాబాద్/ ఇబ్రహీంపట్నం: రంగారెడ్డి, వికారాబాద్ కలెక్టరేట్లలో కలెక్టర్లు సి.నారాయణ రెడ్డి, ప్రతీక్ జైన్ ఫిర్యాదులు స్వీకరించారు. రంగారెడ్డిలో 152, వికారాబాద్లో 126 దరఖాస్తులు అందాయి.