
- మానవతా సాయం కింద అందుతున్న ఫుడ్ను అధిక ధరలకు విక్రయం
గాజా: గాజాలో రోజురోజుకు ఆకలి కేకలు తీవ్రం అవుతున్నాయి. ఇండియాలో రూ.5కే దొరికే పార్లే-–జీ బిస్కెట్ ప్యాకెట్.. గాజాలో 500 రెట్లు ఎక్కువకు అమ్ముతున్నారు. అంటే ఇక్కడ 5 రూపాయల పార్లే జీ బిస్కెట్ ప్యాకెట్.. గాజాలో 24 యూరోలు (రూ.2,342)లకు అమ్ముతున్నారని ఓ వ్యక్తి ఇటీవల ‘ఎక్స్’లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ పోస్ట్ వైరల్గా మారింది.
‘‘చాలా రోజుల నిరీక్షణ తర్వాత ఈ రోజు రవీఫ్కు ఇష్టమైన బిస్కెట్లను కొనిచ్చాను. వీటి ధర ఇంతకుముందు 1.5 యూరోలే ఉండేది. కానీ ప్రస్తుతం 24 యూరో (రూ.2,342)లకు పెరిగింది. అయినా రవీఫ్కు ఇష్టమైన ట్రీట్ను నేను కాదనలేకపోయాను’’ ఓ తండ్రి తన కూతురికి బిస్కెట్ ప్యాకెట్ ఇస్తూ ట్విట్టర్లో పోస్ట్ చేసిన వీడియో వైరల్గా మారింది. పార్లే బిస్కెట్లు మానవతా సాయం కింద ఇండియా నుంచి గాజాకు తరలించారు. ఇక్కడ బ్లాక్ మార్కెట్ ద్వారా ఆ బిస్కెట్లను అధిక ధరలకు అమ్ముతున్నారు. ‘‘గాజాలోకి వచ్చే వస్తువులన్నీ మానవతా సాయం కింద ఉచితంగా వస్తుంటాయి. అయితే, కొద్దిమందికి మాత్రమే అవి దొరుకుతున్నాయి.
ఆహార కొరత కారణంగా కొంతమంది వాటిని బ్లాక్ మార్కెట్ లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు’’ అని డాక్టర్ ఖలీద్ అల్షానా ఎన్డీటీవీకి చెప్పారు. మూడు నెలలకు పైగా సరిహద్దులను మూసివేయడంతో 20 లక్షల మంది ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారని, ఇదే అదునుగా భావించి కొంతమంది ఫుడ్ను బ్లాక్ మార్కెట్ చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నారని వెల్లడించారు. ప్రస్తుతం గాజాలో కిలో షుగర్ రూ.4,914, లీటర్ కుకింగ్ ఆయిల్ రూ.4,177, కిలో ఆలుగడ్డలు రూ.1,965, కిలో ఉల్లిపాయలు రూ.4,423, కప్ కాఫీ రూ.1,800లకు అమ్ముతున్నారు.