- ధర్మేంద్ర ప్రధాన్ను తొలగించాలంటూ కాంగ్రెస్, ఇండియా కూటమి పట్టు
- స్పీకర్ ఓం బిర్లాతో రాహుల్, అఖిలేశ్ భేటీ..
- అమిత్ షా ప్రత్యేక సమావేశం
- ప్రతిపక్ష ఎంపీల ప్లకార్డులు లాక్కునే యత్నం.. తోపులాట
న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీక్ వ్యవహారం పార్లమెంట్ను వరుసగా నాలుగో రోజూ స్తంభింపజేసింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ప్రతిపక్షం పట్టుబట్టగా, ఎలాంటి షరతులు లేకుండా చర్చకు సిద్ధమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇరు పక్షాలు తమ వైఖరిని మార్చకపోవడంతో లోక్సభ, రాజ్యసభలో ఎలాంటి కార్యక్రమం జరగకుండానే సభలను రోజంతా వాయిదా వేశారు. మరోవైపు పార్లమెంట్ ఆవరణలో అధికార, ప్రతిపక్ష ఎంపీలు ఒకరిపై ఒకరు నినాదాలు చేస్తూ ఆందోళనలు నిర్వహించారు.
గురువారం ఉదయం లోక్సభ సమావేశం ప్రారంభం కాగానే ప్రతిపక్ష సభ్యులు నీట్ పేపర్ లీక్, విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జీ అంశాలను ప్రస్తావిస్తూ సభ మధ్యలోకి వచ్చి నినాదాలు చేశారు. అన్ని అంశాలపై చర్చకు అవకాశం ఇస్తామని స్పీకర్ ఓం బిర్లా చెప్పారు. ప్రతిపక్షం వెనక్కి తగ్గకపోడంతో సభను మొదట మధ్యాహ్నం 12 గంటల వరకు, తర్వాత 2 గంటల వరకు, చివరకు రోజంతా వాయిదా వేశారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, టీఎంసీ నేతలు సౌగత రాయ్, మహువా మొయిత్రా స్పీకర్ ఓం బిర్లాను కలిసి చర్చించారు. అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా స్పీకర్తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
పట్టువీడని అధికార, ప్రతిపక్షాలు
పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి లోక్సభలో కిరెన్ రిజిజు మాట్లాడుతూ నీట్ అంశంపై గురువారమే చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. నీట్పై ఎన్ని రోజులైనా, ఎంతసేపైనా చర్చకు ప్రభుత్వం సిద్ధమేనని, తేదీని కూడా ప్రతిపక్షమే నిర్ణయించుకోవచ్చని రిజిజు చెప్పారు. కానీ ముందుగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని కాంగ్రెస్తో పాటు ఇండియా కూటమి సభ్యులు స్పష్టం చేశారు. రాజ్యసభలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది.
ప్రతిపక్ష నేత ఖర్గే, ప్రధాన్ రాజీనామాపై ముందుగా ప్రభుత్వం ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు పోలీసుల దాడుల్లో గాయపడి ఆస్పత్రుల్లో ఉన్నారని, వారి కుటుంబాలు తీవ్ర ఆందోళనలో ఉన్నాయని అన్నారు. దీనికి ప్రతిస్పందించిన సభా నాయకుడు జేపీ నడ్డా, చర్చ జరగకుండా ప్రతిపక్షమే అడ్డుకుంటోందని విమర్శించారు. ఉపాధ్యక్షుడు హరివంశ్ పలుమార్లు సభను నడిపేందుకు ప్రయత్నించినా నిరసనలు ఆగకపోవడంతో రాజ్యసభను రోజంతా వాయిదా వేశారు.
పార్లమెంట్ ఆవరణలోనూ పోటాపోటీ
ప్రధాని నివాసం వద్ద కాంగ్రెస్ చేపట్టిన ధర్నాకు నిరసనగా ఎన్డీఏ ఎంపీలు మకర్ ద్వారం వద్ద ఆందోళన చేపట్టి రాహుల్ గాంధీపై నినాదాలు చేశారు. మరోవైపు కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష ఎంపీలు ‘ప్రధాన్ను తొలగించండి’, ‘ప్రాణాలు కాపాడండి.. నీట్ను నిలిపివేయండి’అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.
కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ ప్రశాంత్ పడోలే చేతిలో ఉన్న ప్లకార్డును లాక్కునేందుకు ఎన్డీఏ ఎంపీలు కొందరు ప్రయత్నించడంతో తోపులాట, కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. ఇదే సమయంలో జంతర్మంతర్లో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) మద్దతుదారులు పోటీ పరీక్షల్లో అక్రమాలపై ఆందోళన కొనసాగించారు.
