గంధపు చెక్కల స్మగ్లింగ్లో పార్థీ ముఠా !..నలుగురు మహిళలను అరెస్ట్ చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు

గంధపు చెక్కల స్మగ్లింగ్లో పార్థీ ముఠా !..నలుగురు మహిళలను అరెస్ట్ చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు

హైదరాబాద్​సిటీ, వెలుగు: జాతీయ, రాష్ట్ర రహదారులపై దారి దోపిడీలు, ఇండ్లల్లో దొంగతనాలు, హత్యలు చేసే క్రూరమైన పార్థీ ముఠాలోని నలుగురు సభ్యులను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. పార్థీ ముఠాలోని కొంతమంది మునుపటిలా దోపిడీలు, దొంగతనాలు కాకుండా  కొత్తగా గంధపు చెట్లను నరికి అమ్ముకునే పథకం వేసుకుని వచ్చారు. 23 మంది.. 20 రోజులుగా హైదరాబాద్​లో తిరుగుతూ ఎవరికీ అనుమానం రాకుండా గంధం చెక్కలను స్మగ్లింగ్ చేస్తున్నారు. అనుకోకుండా ఆ ముఠాలోని నలుగురు మహిళలు ఇప్పుడు పోలీసులకు చిక్కారు. 

కరుడుగట్టిన ముఠా...

మహారాష్ట్ర, గుజరాత్​, రాజస్థాన్​, మధ్యప్రదేశ్​ మూలాలున్న పార్థీ తెగ.. దొంగతనాలకు, దారి దోపిడీలకు పెట్టిందిపేరు. దోపిడీలకు అడ్డొస్తే హత్య చేయడానికి కూడా వీరు వెనుకాడరు. అట్లాంటి ఈ ముఠాకు చెందిన 23 మంది.. 20 రోజుల క్రితం మధ్యప్రదేశ్​నుంచి హైదరాబాద్​వచ్చారు. మధురానగర్​లో తిరుగుతూ ఫుట్​పాత్​లపై పడుకుంటూ యూసుఫ్‌‌గూడలోని -ఎమ్‌‌ఎస్‌‌ఎమ్‌‌ఈ క్యాంపస్​లో గంధపు చెట్లను లక్ష్యంగా చేసుకున్నారు.

స్థానిక ఆటో డ్రైవర్లతో, స్థానికులతో స్నేహంగా ఉంటూ ఎవరికీ అనుమానం రాకుండా ఎమ్‌‌ఎస్‌‌ఎమ్‌‌ఈ  క్యాంపస్​లో రోజుకో గంధపు చెట్లను నరుకుతూ స్మగ్లింగ్​చేయడం మొదలుపెట్టారు. జూబ్లీహిల్స్, మధురానగర్ పోలీసులు ఈ గ్యాంగ్ కదలికలను గుర్తించి ముఠాలోని పలాన్ ​బాయి, సహ్నాజ్​బాయి, నిమత్​బాయి, మాధురిలను పట్టుకున్నారు. మిగతా వారు పరారీలో ఉన్నారని జూబ్లీహిల్స్​ అడిషనల్​ ఇన్​స్పెక్టర్​ మధుసూదన్ పేర్కొన్నారు.