
- జువెలరీ షాప్ నిర్వాహకులను మోసం చేసిన వ్యక్తిపై కేసు నమోదు
జీడిమెట్ల, వెలుగు: ఓ షాపింగ్ మాల్లోని జువెలరీ సెక్షన్ లో గోల్డ్ కోటెడ్ గాజులను ఎక్స్ చేంజ్ కింద ఇచ్చి కొత్త బంగారు గాజులను తీసుకెళ్లిన వ్యక్తిపై పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు ఫైల్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్లోని జాలోర్ జిల్లా పన్ వాడ్ గ్రామానికి చెందిన మనీశ్అలియాస్ దీపేశ్ కుమార్ సిటీకి వచ్చి బంగారం పనిచేస్తున్నాడు. గత నెల 15న సుచిత్ర ఏరియాలోని సౌతిండియా మాల్కు వచ్చిన దీపేశ్కుమార్ అక్కడి జువెలరీ సెక్షన్కు వెళ్లాడు.
గోల్డ్ కోటింగ్ ఉన్న 31 గ్రాముల నకిలీ బంగారు గాజులను ఎక్స్చేంజ్ కింద ఇచ్చాడు. 27 గ్రాముల కొత్త బంగారు గాజులను తీసుకెళ్లాడు. గోల్డ్ కోటెడ్ గాజులపై హాల్ మార్క్ ఉండటంతో జువెలరీ సెక్షన్లో ఉన్న సిబ్బంది అనుమానించలేదు. అయితే, ఆ గాజులను హెడ్డాఫీసుకు పంపించగా అవి రోల్డ్ గోల్డ్ అని తేలింది. దీంతో షాపింగ్ మాల్ మేనేజర్ పేట్బషీరాబాద్ పీఎస్లో కంప్లయింట్ చేశాడు. పోలీసులు దీపేశ్కుమార్పై కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.