నిజాయితీతో పనిచేస్తే ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదంటున్న పబ్లిక్
కర్నూల్: తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్లో తన ఆఫీస్లోనే హత్యకు గురైన తహసీల్దార్ విజయారెడ్డి ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వణుకు పుట్టించింది. ఈ ఘటనతో రెవెన్యూ ఉద్యోగులు హడలిపోతున్నారు.
ఎంతలా అంటే.. కర్నూల్ జిల్లాలోని పత్తికొండలో ఉమామహేశ్వరి తహసీల్దార్గా పనిచేస్తున్నారు. తహసీల్దార్ విజయారెడ్డి ఘటనతో భయానికి లోనైన ఆమె తన చాంబర్లో ఏకంగా తన కుర్చీకి అడ్డుగా తాడు కట్టించింది. ఆర్జీలు ఇవ్వదలచిన వారు ఎవరైనా సరే ఆ తాడు బయట నుంచే ఇవ్వాలని, తాడు లోపలికి ఎవరినీ అనుమతించొద్దని కార్యాలయ సిబ్బందిని ఆదేశించారు. ఉమామహేశ్వరి తీసుకున్న జాగ్రత్తలను చూసి సిబ్బందితో పాటూ, కార్యాలయానికి వచ్చిన ప్రజలు కూడా నోరు వెళ్లబెట్టి చూస్తున్నారు. ఈ విషయమై విలేకరులు తహసీల్దార్ను ప్రశ్నించగా.. ‘మా జాగ్రత్తలో మేం ఉండాలి కదా’ అన్నారు. ఉమామహేశ్వరి ఇలా చేయడంపై చాలా మంది చాలా రకాలుగా స్పందిస్తున్నారు. తహసీల్దార్ నిజాయితీతో పనిచేస్తే ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని అక్కడి ప్రజానీకం అంటున్నారు.