- జీతాలు, పెన్షన్లు 1వ తేదీన ఇవ్వండి: బండి సంజయ్
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరో లేఖాస్త్రం సంధించారు. ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల చెల్లింపుపై బహిరంగ లేఖ రాసిన ఆయన..1వ తేదీనే జీతాలు అందుకోవడం ఉద్యోగుల ప్రాథమిక హక్కు అని గుర్తు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్టు సిబ్బందికి వేతనాలు, పెన్షన్దారులకు పెన్షన్లు ప్రతి నెల 1వ తేదీనే చెల్లించాలని ముఖ్యమంత్రిని ఆ లేఖలో కోరారు.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, ఆర్టికల్ 300(ఎ) ప్రకారం సకాలంలో ఉద్యోగులు, పెన్షన్దారులు వేతనం పొందే ప్రాథమిక హక్కుని కల్పించిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షన్దారులకు సకాలంలో వేతనాలు చెల్లించకపోవడం వారి జీవించే హక్కును కాలరాయడమేనని బండి సంజయ్ పేర్కొన్నారు. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 360 ప్రకారం ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ప్రకటిస్తే తప్ప ఉద్యోగుల, పెన్షన్దారుల చెల్లింపులు ఆలస్యం చేయకూడదన్నారు. ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లు మాత్రమే కాకుండా ఇతర అత్యవసర బిల్లులు కూడా ప్రభుత్వం పెండింగ్ లో పెడుతోందని బండి సంజయ్ ఆరోపించారు.
హెల్త్ రియంబర్స్మెంట్, సరెండర్ లీవ్, జీపీఎఫ్, అడ్వాన్స్లు, పార్ట్, ఫైనల్ విత్డ్రాయల్... ఇలా అన్ని బిల్లులు నెలల తరబడి పెండింగ్లో ఉంటున్నాయని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచిన ఉద్యోగులకు సకాలంలో వేతనాలు ఇవ్వకపోవడం టీఆర్ఎస్ అసమర్థ పాలనకు నిలువుటద్దమని ఆయన విమర్శించారు. 2014లో 16 వేల కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి.. ఇప్పుడు ఉద్యోగులు, పెన్షన్దారులు ప్రతినెల 15వ తారీఖు వరకు జీతాల కోసం ఎదురుచూసే దౌర్భాగ్యస్థితిలోకి రాష్ట్రాన్ని నెట్టిన ఘనత కేసీఆర్దేనని బండి సంజయ్ విమర్శించారు.