
న్యూఢిల్లీ: పేటీఎం పేరెంట్ కంపెనీ వన్97 కమ్యూనికేషన్స్ స్టాక్ ధర విషయంలో తాము ఎలాంటి జోక్యమూ చేసుకోబోమని ఎండీ, సీఈఓ విజయ్ శేఖర్ శర్మ షేర్హోల్డర్లకు స్పష్టం చేశారు. సంస్థను లాభదాయకంగా మార్చడానికి యాజమాన్యం ప్రయత్నాలు కొనసాగుతాయని అన్నారు. కంపెనీ 22వ యాన్యువల్ జనరల్ మీటింగ్లో (ఏజీఎం) ఆయన మాట్లాడుతూ, 2018-–19 వరకు కంపెనీ విస్తరణ మోడ్లో ఉందని, 2019–-20 నుండి మానిటైజేషన్ మోడ్లోకి ప్రవేశించిందని తెలిపారు. ఇది వరకే ప్రకటించిన మేరకు సెప్టెంబర్ 2023తో ముగిసే క్వార్టర్లో పేటీఎంకు ఆపరేషనల్ ప్రాఫిట్స్ వస్తాయని శర్మ చెప్పారు.
"షేరు ధర మారడానికి అనేక అంశాలు కారణమవుతాయి. కంపెనీ లాభదాయకత ఈ విషయంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కంపెనీ గ్రోత్ కూడా షేరు ధరను ప్రభావితం చేస్తుంది. అయితే ఈ రెండు మాత్రమే షేరు ధరల్లో మార్పులకు కారణం కాదు. చిన్న,పెద్ద, అంతర్జాతీయ పెట్టుబడిదారులు, అనేక ఇతర సెంటిమెంట్లు షేర్ల ధరలను మార్చగలుగుతాయి”అని వివరించారు. కంపెనీని మరింత ముందుకు తీసుకెళ్లి, బలమైన లాభాలను ఆర్జించేలా మేనేజ్మెంట్ ప్రయత్నాలు చేస్తోందని శర్మ చెప్పారు.
వన్97 షేరు ఐపీఓ స్థాయి రూ. 2,150కి ఎప్పుడు వెళ్తుందని కొందరు షేర్హోల్డర్లు మేనేజ్మెంట్ను అడిగారు. శుక్రవారం ఈ షేరు రూ.771 వద్ద ముగిసింది. ఏజీఎం సందర్భంగా మాట్లాడిన చాలా మంది కంపెనీ వ్యాపార విధానాలపై నమ్మకం ఉందని అన్నారు. వన్97 కమ్యూనికేషన్స్ నష్టాలు, షేరు ధర తగ్గడంపై కొందరు అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ సంస్థలో దాదాపు 3 కోట్ల మంది వ్యాపారులు ఉన్నారని, మరింత మంది వ్యాపారులకు సేవలను విస్తరించడానికి ప్రచార కార్యక్రమాలు చేపట్టామని విజయ్ శేఖర్ శర్మ అన్నారు.