న్యూఢిల్లీ: పేటీఎమ్ ఓనర్ వన్97 కమ్యూనికేషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా విజయ్ శేఖర్ శర్మను తిరిగి నియమించడాన్ని పెట్టుబడిదారుల సలహా సంస్థ ఐఐఏఎస్ వ్యతిరేకించింది. సంస్థను ఆయన సరిగ్గా నడపడం లేదని స్పష్టం చేసింది. దేశంలోని లిస్టెడ్ కంపెనీల వాటాదారుల తీర్మానాలపై ఓటింగ్ సిఫార్సులను అందించే ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్ అడ్వైజరీ సర్వీసెస్, పేటీఎం గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ మధుర్ దేవరాకు ఇస్తున్న జీత, భత్యాలపైనా అభ్యంతరం తెలిపింది. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమించడాన్ని మాత్రం సమర్థించింది.
ఈ సిఫార్సుల నేపథ్యంలో శుక్రవారం బీఎస్ఈలో వన్97 కమ్యూనికేషన్స్ షేర్లు 4.65 % తగ్గి రూ.787.15 వద్ద ముగిశాయి. పేటీఎం షేర్లు ప్రస్తుతం తమ ఐపీఓ ఇష్యూ ధర రూ. 2,150 కంటే 63.6 % నష్టంతో ట్రేడవుతున్నాయి. "విజయ్ శేఖర్ శర్మ కంపెనీని లాభదాయకంగా మార్చడానికి అనేక చర్యలు తీసుకున్నారు కానీ ఫలితాలు రాలేదు. కంపెనీ నిర్వహణను ప్రొఫెషనల్గా మార్చాలి. రొటేషన్ ద్వారా శర్మ పదవీ విరమణ చేయాల్సిన అవసరం లేదు. మేనేజింగ్ డైరెక్టర్గా పదవీకాలం ముగిసిన తరువాత శర్మ నాన్ -ఎగ్జిక్యూటివ్ హోదాలో కొనసాగితే బోర్డు పర్మిషన్ని పొందుతారు" అని రిపోర్టు పేర్కొంది.