రైతుల రుణాలు మాఫీ చేయాలె
హైదరాబాద్ , వెలుగు : లక్ష రూపాయల లోపు రైతు రుణాలు మాఫీ చేయాలని సీఎం కేసీఆర్ను పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కోరారు. క్వింటాల్ పత్తికి రూ.15 వేల మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేశారు. శనివారం సీఎంకు ఈ మేరకు బహిరంగ లేఖ రాశారు. రైతుల పంటకు మద్దతు ధర రావడం లేదని, వారు రోడ్డెక్కి ఆందోళనలు చేసినా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. దళారులు క్వింటాల్ పత్తికి ఆరేడు వేల ధర కూడా పెట్టకపోవడంతో రైతులు నష్టపోతున్నారని తెలిపారు. పంట పెట్టుబడిని పరిగణలోకి తీసుకొని క్వింటాల్ కు రూ.15 వేల ధర చెల్లించాలని కోరారు. సరైన వ్యవసాయ విధానం, పంటల ప్రణాళిక, రైతులకు దిశానిర్దేశం చేసే వ్యవస్థలు కుంటు పడటం తదితర కారణాలతో రైతులు, వ్యవసాయం సంక్షోభంలోకి పోతున్నాయని తెలిపారు. నేషనల్ క్రైం బ్యూరో రికార్డుల ప్రకారం రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ నాలుగో స్థానంలో ఉందని, ఏడేళ్లలో 6,557 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. ఈ ఏడాది నవంబర్ వరకు రాష్ట్రంలో 512 మంది రైతులు బలవన్మరణం చెందినట్టు ఒక స్వచ్ఛంద సంస్థ చేసిన అధ్యయనం తేల్చిందన్నారు. ఆత్మహత్య చేసుకున్న వారిలో కౌలు రైతులే ఎక్కువ మంది ఉన్నారని తెలిపారు. రైతు ఆత్మహత్యలను ఆపేందుకు ప్రభుత్వం శాశ్వత మర్గాలు చూపించాలన్నారు. కౌలు రైతులకు రైతులుగా గుర్తించి పథకాలు వర్తింపజేయాలన్నారు. వీటిని పట్టించుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.
పీసీసీ ఉపాధ్యక్షులకు బాధ్యతలు
పీసీసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు, వైస్ ప్రెసిడెంట్లకు వివిధ బాధ్యతలు అప్పగిస్తూ రేవంత్ నిర్ణయం తీసుకున్నారని వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. మల్లు రవికి కో ఆర్డినేషన్ అండ్ అడ్మినిస్ట్రేషన్, నిరంజన్కు ఎలక్షన్ కమిషన్, కుమార్ రావుకు క్యాలెండర్ ప్రోగ్రామ్స్ అండ్ ఇంటిమేషన్, వేం నరేందర్ రెడ్డికి డీసీసీ అధ్యక్షులు, మండల కమిటీల ఆర్గనైజేషన్ అండ్ కో ఆర్డినేషన్ బాధ్యతలు అప్పగించారు. వేణుగోపాల్ రావుకు చీఫ్ ప్రొటోకాల్, ట్రైనింగ్ ఆర్గనైజేషన్ జగదీశ్వర్ రావుకు ఏఐసీసీ ప్రోగ్రామ్స్ కో ఆర్డినేషన్, కిరణ్ కుమార్ రెడ్డికి మీడియా కమ్యూనికేషన్స్ బాధ్యతలు ఇచ్చారు.