- ఓటమి భయంతోనే కేసీఆర్నిధులు మళ్లిస్తున్నరు : రేవంత్
హైదరాబాద్,వెలుగు : ఓటమి భయంతో రైతుబంధు నిధులను సీఎం కేసీఆర్ ఇతర చెల్లింపులకు మళ్లిస్తున్నారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. దీనిపై శనివారం సీఈఓ వికాస్రాజ్ను కలిసి ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఓ ప్రకటనను విడుదల చేశారు. కమీషన్ల కోసమే రైతుబంధు నిధులను కాంట్రాక్టర్లకు మళ్లిస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న అసైన్డ్ భూములను ఇతరుల పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని దుయ్యబట్టారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం చేసే అన్ని లావాదేవీలపై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ప్రభుత్వ ట్రాన్సాక్షన్స్పై విజిలెన్స్ నిఘా పెట్టేలా ఇటు హైదరాబాద్తో పాటు అటు ఢిల్లీలోనూ ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తామని ఆయన పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం ఆయన ఈ మేరకు ట్వీట్ చేశారు. ‘‘ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం శ్రమించిన నాయకులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు. దాడులు, కేసులకు వెరవకుండా కాంగ్రెస్ చేసిన పోరాటంలో మీరంతా ప్రజల పక్షాన నిటారుగా, నిఖార్సుగా నిలబడ్డారు. తెలంగాణలో ప్రజాస్వామ్య పునరుద్ధరణలో మీ అందరి పాత్ర మరువలేనిది’’ అని రేవంత్ పేర్కొన్నారు.