కమీషన్ల కోసం కాంట్రాక్టర్లకు రైతుబంధు ఫండ్స్.​!

కమీషన్ల కోసం కాంట్రాక్టర్లకు  రైతుబంధు ఫండ్స్.​!
  •     ఓటమి భయంతోనే కేసీఆర్​నిధులు మళ్లిస్తున్నరు : రేవంత్​

హైదరాబాద్,వెలుగు :  ఓటమి భయంతో రైతుబంధు నిధులను సీఎం కేసీఆర్​ ఇతర చెల్లింపులకు మళ్లిస్తున్నారని పీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి మండిపడ్డారు. దీనిపై శనివారం సీఈఓ వికాస్​రాజ్​ను కలిసి ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ​ఓ ప్రకటనను విడుదల చేశారు. కమీషన్ల కోసమే రైతుబంధు నిధులను కాంట్రాక్టర్లకు మళ్లిస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్​ చుట్టుపక్కల ఉన్న అసైన్డ్​ భూములను ఇతరుల పేర్ల మీద రిజిస్ట్రేషన్​ చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని దుయ్యబట్టారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం చేసే అన్ని లావాదేవీలపై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ప్రభుత్వ ట్రాన్సాక్షన్స్​​పై విజిలెన్స్​ నిఘా పెట్టేలా ఇటు హైదరాబాద్​తో పాటు అటు ఢిల్లీలోనూ ఎన్నికల కమిషన్​కు ఫిర్యాదు చేస్తామని ఆయన పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​ గెలుపు కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ పీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం ఆయన ఈ మేరకు ట్వీట్​ చేశారు. ‘‘ఎన్నికల్లో కాంగ్రెస్​ గెలుపు కోసం శ్రమించిన నాయకులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు. దాడులు, కేసులకు వెరవకుండా కాంగ్రెస్​ చేసిన పోరాటంలో మీరంతా ప్రజల పక్షాన నిటారుగా, నిఖార్సుగా నిలబడ్డారు. తెలంగాణలో ప్రజాస్వామ్య పునరుద్ధరణలో మీ అందరి పాత్ర మరువలేనిది’’ అని రేవంత్​ పేర్కొన్నారు.