హైదరాబాద్, వెలుగు: టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదని, దీన్ని ప్రజల్లో బాగా ప్రచారం చేసి ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్ చరిత్ర సృష్టించాలని పీసీసీ చీఫ్ ఉత్తమ్ పిలుపునిచ్చారు. దుబ్బాకలో దెబ్బకొడితే కేసీఆర్ దిమ్మతిరగాలన్నారు. గాంధీభవన్లో శుక్రవారం దుబ్బాక ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. ‘‘మల్లన్నసాగర్ భూ నిర్వాసితులకు ఇస్తామన్న పరిహారం ఇవ్వలేదు. డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామని మోసం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ప్రజలకు గుర్తు చేసి టీఆర్ఎస్ నేతలను నిలదీసేలా చేయాలి’’ అన్నారు.
నియంతతో పోరాడుతున్నాం..: దామోదర
మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ.. ఎన్నికలు అనగానే టీఆర్ఎస్ నేతలు డబ్బుల సంచులు, మద్యం బాటిళ్లతో దిగిపోతారని, కాంగ్రెస్ కార్యకర్తలు తెలివితో వ్యవహరించి ఇలాంటి ఎత్తుగడలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో దుర్మార్గ పాలన నడుస్తోందని, అందరం ఒక నియంతతో పోరాటం చేస్తున్నామని గుర్తుంచుకోవాలన్నారు. వారం రోజుల్లో అన్ని గ్రామాల్లో అనుబంధ సంఘాల కమిటీలు పూర్తి చేయాలని సమావేశంలో నిర్ణయించారు.