గాంధీభవన్: క్విట్ ఇండియా 78వ దినోత్సవం సందర్బంగా గాంధీభవన్ ఆవరణలో కాంగ్రెస్ జెండా ఎగురవేశారు పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ కార్యక్రమంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్యెల్యే జగ్గారెడ్డి, నాయకులు అంజన్ కుమార్ యాదవ్, మల్లు రవి, గూడూరు నారాయణరెడ్డి, దాసోజు శ్రవణ్,సోహల్, బొల్లు కిషన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో పార్టీ నాయకులంతా పని చేయాల్సిన బాధ్యత ఉందన్నారు. ఈ దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన పార్టీ, తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీనే అన్నారు.
సాగునీరు విషయంలో తెలంగాణ తీవ్రమైన నష్టం జరుగుతుందన్నారు ఉత్తమ్. కృష్ణ జలాల విషయంలో తెలంగాణ రాక ముందు పనికి రాని విషయాలు పెద్ద గా మాట్లాడి సీఎం కేసీఆర్ ప్రజలను రెచ్చగొట్టాడని అన్నారు. రూ.3 లక్షల కోట్లు అప్పులు చేసి ఆడంబరాలు చేసుకుంటూ తెలంగాణ ను అప్పుల ఊబిలో పడేసాడన్నారు. పోతిరెడ్డిపాడు దగ్గర ఆంద్రప్రదేశ్ రోజుకు 11 టీఎంసీ ల నీరు దోచుకు పోతుంటే ఏ మాత్రం స్పందించడం లేదని విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వం 5వ తెదీన అపెక్స్ కమిటీ మీటింగ్ పెడితే కేసీఆర్ కాబినెట్ మీటింగ్ ఉందని అపెక్స్ కమిటీ మీటింగ్ వాయిదా వేశారని, ఇంతకంటే అన్యాయం ఏముంటుందని అన్నారు. పోతిరెడ్డిపాడు, రాయలసీమ ప్రాజెక్టులు కడుతుంటే కేసీఆర్ కొత్త సచివాలయం కోసం చర్చించడం దారుణమని అన్నారు. వలస కార్మికులకు సహాయం చేసే విషయంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చాలా శ్రమించిందన్నారు. త్వరలో జిహెచ్ఎంసి, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలు జరుగనున్నాయని.. వాటి విషయంలో కార్యకర్తలు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు ఉత్తమ్.