
తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీని కట్టి తీరాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వాన్ని పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి డిమాండ్ చేశారు. తమ హయాంలో మొదలుపెట్టిన ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును కేసీఆర్ సర్కార్ కమీషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టుగా రీ డిజైన్ చేసిందని ఆయన ఆరోపించారు. సోమవారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా ప్రాణహిత సంగమ స్థానమైన కౌటాల మండలం తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మాణ స్థలాన్ని పీసీసీ బృందం సందర్శించింది. పీసీసీ చీఫ్ ఉత్తమ్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ రేవంత్రెడ్డి, ఇతర నాయకులు మొదట అంబేడ్కర్ విగ్రహం వద్ద నివాళులర్పించి, ప్రాణహిత నదికి ప్రత్యేక పూజలు చేశారు. నాటు పడవలో నదిలో ప్రయాణిస్తూ వరద ప్రవాహాన్ని పరిశీలించారు.
అనంతరం అక్కడే మీడియా సమావేశంలో ఉత్తమ్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ హయాంలో ప్రారంభించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును రీ డిజైన్ పేరిట ఎటూకాకుండా చేసిన ఘనత కేసీఆర్దేనని విమర్శించారు. కమీషన్ల కక్కుర్తి కోసమే కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చారని ఆరోపించారు. గ్రావిటీ ద్వారా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతాంగానికి సాగు నీరును అందించే తుమ్మిడిహట్టి బ్యారేజీని కేవలం స్వార్థ ప్రయోజనాల కోసమే ఇతర ప్రాంతానికి తరలించారన్నారు. రీ డిజైన్ చేసిన తర్వాత కూడా కేసీఆర్ తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ కడుతామని చెప్పారని, ఆ మాట నిలబెట్టుకోవాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. రూ. 80వేల కోట్లతో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ట్ర ప్రజలకు గుదిబండలా మారుతోందని, ఈ ప్రాజెక్టుకు గ్లోబల్ టెండర్లు పిలువకపోవడంలో ఉన్న మతలబ్ ఏందని ప్రశ్నించారు. తుమ్మిడిహట్టి బ్యారేజీని కట్టేంత వరకు పోరాడుతామని ఆయన స్పష్టం చేశారు.
ప్రజల నోట్లో మట్టి కొడుతున్న కేసీఆర్: భట్టి
రాష్ట్ర ప్రజల సొమ్మును దోచుకునేందుకు కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. ప్రాజెక్టు పూర్తికాక ముందే సంబురాలు చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ రైతాంగంతోపాటు తెలంగాణ ప్రజల నోట్లో కేసీఆర్ మట్టి కోడుతున్నారని ఆయన విమర్శించారు.
కేసీఆర్వి మాయమాటలు: రేవంత్
తెలంగాణలో ప్రాజెక్టులు పూర్తి చేసి రైతులకు సాగు నీరు అందించలేని కేసీఆర్ రాయలసీమను రతనాలసీమగా చేస్తాననడం విడ్డూరంగా ఉందని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్రెడ్డి విమర్శించారు. కోటి ఎకరాలకు సాగు నీరు అందిస్తామని కేసీఆర్ మాయమాటలు చెబుతున్నారని ఆయన అన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని, అందుకే టీఆర్ఎస్ సర్కార్ అక్రమాలపై కేంద్రం పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరం అక్రమాలు, అవినీతిపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్రెడ్డి, ఎమ్మెల్యేలు సీతక్క, శ్రీధర్బాబు, నాయకులు వి.హన్మంతరావు, పొన్నాల లక్ష్మయ్య, కొండా విశ్వేశ్వర్రెడ్డి, రాథోడ్ రమేశ్, షబ్బీర్ అలీ, మల్లు రవి తదితరులు పాల్గొన్నారు.