
హైదరాబాద్, వెలుగు: నిరుద్యోగులకు అన్యా యం పేరుతో కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు అశోక్ చేస్తున్న దీక్ష వెనుక బీఆర్ఎస్ పార్టీ కుట్ర దాగి ఉందని పీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ ఆరోపించారు. మంగళవారం గాంధీ భవన్లో మీడియాతో ఆయన మాట్లాడారు. ఇటీవల జరిగిన నల్గొండ నియోజకవర్గ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఎమ్మెల్సీగా పోటీ చేసిన అశోక్.. తన పబ్బం గడుపుకునేందుకు, రాజకీయ ఉనికి కోసమే ఇలాంటి దీక్ష చేస్తున్నాడని విమర్శించారు.
రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ విడుదల కోసం రేవంత్ సర్కార్ కసరత్తు చేస్తున్న సమయంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకుండా అడ్డుకునేందుకు బీఆర్ఎస్, బీజేపీ చేస్తున్న కుట్రలో భాగంగానే అశోక్ ఈ దీక్ష చేస్తున్నాడని ధ్వజమెత్తారు. నిరుద్యోగులు ఇలాంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. పదేండ్లలో ఉద్యోగాలు ఇవ్వలేని బీఆర్ఎస్ పార్టీ.. 20 నెలల పాలనలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్న రేవంత్ సర్కార్పై విషం చిమ్ముతున్న విషయాన్ని నిరుద్యోగులు గమనించాలని కోరారు.