- తెలంగాణ పొలీసులపై సుప్రీం ఆగ్రహం
న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్రంలో ప్రివెన్షన్ ఆఫ్ డేంజరస్ యాక్టివిటీస్ యాక్ట్ (పీడీ యాక్ట్) అమలులో తెలంగాణ పోలీసులు అనుసరిస్తున్న విధానాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. చాలా సర్వసాధారణంగా ఈ చట్టాన్ని అమలు చేస్తున్నారని, ఎవరిపైపడితే వారిపై ఈ చట్టాన్ని అమలు చేయడం సరికాదని పోలీసులను మందలించింది. ఆలోచన లేకుండా డిటెన్షన్ ఆర్డర్ ఇవ్వొద్దని సీజేఐ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్మనోజ్ మిశ్రాలతో కూడిన బెంచ్ శుక్రవారం తెలంగాణ పోలీసులకు వార్నింగ్ ఇచ్చింది.
తరచూ చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్న నేరస్తుడి విషయంలో పోలీసులు ఈ యాక్ట్ ను ప్రయోగించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి నేరస్తుల ముందస్తు నిర్బంధం ద్వారా మహిళల్లో భయాన్ని తొలగించవచ్చనే పోలీసుల ఆలోచనను తప్పుబట్టింది. గతేడాది అమీనా బేగం కేసులోనూ పలువురిపై తెలంగాణ పోలీసులు ఇదే తరహాలో అనాలోచితంగా చట్టాన్ని అమలు చేశారని గుర్తు చేసింది. అలాగే గడిచిన ఐదేండ్లలో ముందస్తు నిర్భంద చట్టం ప్రకారం దాఖలైన ఐదు ఆర్డర్లను కొట్టి వేసినట్లు పేర్కొంది.
ఏడాదిగా తెలంగాణ హైకోర్టు సైతం ఇలాంటి 10 ఆర్డర్లను తోసిపుచ్చినట్లు వెల్లడించింది. అడ్వైజరీ బోర్డ్, హైకోర్టు, సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న నిర్బంధ ఉత్తర్వులపై సవాళ్లను పరిగణనలోకి తీసుకోవాలని ప్రతివాదులైన పోలీసులకు ఆదేశించింది. ప్రివెంటీవ్ ఆఫ్ డిటెక్షన్ యాక్ట్ అమలు చేసే ముందు నేరాభియోగాల తీవ్రతను పరిగణనలోకి తీసుకొని అమలు చేయాలని హితవు చెప్పింది.