ఆపరేషన్ కగార్ ఆపేయాలి : శాంతి చర్చల కమిటీ

ఆపరేషన్ కగార్ ఆపేయాలి :  శాంతి చర్చల కమిటీ
  • మావోయిస్టులతో చర్చలు జరపాలి:  శాంతి చర్చల కమిటీ
  • ఇందిరా పార్క్ వద్ద శాంతి చర్చల కమిటీ మహా ధర్నా 

ముషీరాబాద్, వెలుగు: కాల్పుల విరమణ ప్రకటించి మావోయిస్టు పార్టీతో వెంటనే శాంతి చర్చలు ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ‘శాంతి చర్చల కమిటీ’ డిమాండ్ చేసింది. అడవుల్లోని ఖనిజ నిక్షేపాలు, వనరులను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టాలని కేంద్రం ప్రయత్నిస్తున్నదని ఆరోపించింది. అడవులను కొల్లగొట్టేందుకే ఆపరేషన్ కగార్ చేపట్టిందని మండిపడింది. దీన్ని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ‘శాంతి చర్చల కమిటీ’ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ ధర్నాచౌక్​లో మహాధర్నా చేపట్టారు. 

ధర్నాకు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, ఎంపీలు మల్లు రవి, అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఎమ్మెల్సీ కోదండరాంతో పాటు పలు సంఘాల నేతలు హాజరై మాట్లాడారు. నక్సల్స్ ముక్త్ భారత్ కాదని.. అమిత్ షా భారత్ గా తయారైందని నారాయణ విమర్శించారు. దేశం లోపల ఉన్నవాళ్లతో చర్చలు జరపకుండా.. అవతల ఉన్నోళ్లతో చర్చలు జరిపి ఎక్కడికక్కడ గప్​చుప్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నక్సలైట్లు, కమ్యూనిస్టులు వేర్వేరు అని.. కానీ, ఒకటిగా జత కడుతున్నారని మండిపడ్డారు. కోట్లాది మంది ప్రజల అభ్యున్నతి కోసం నంబాల కేశవరావు వంటి వాళ్లు మావోయిస్టులుగా మారారని కూనంనేని సాంబశివరావు అన్నారు. ప్రజల కోసం తుపాకీ పట్టిన వాళ్లు గొప్పోళ్లు కారా? అని ప్రశ్నించారు.

 ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధంగా కేంద్రం వ్యవహరిస్తున్నదని కోదండరాం అన్నారు. ఆపరేషన్ కగార్ లో అధిక భాగం చనిపోతున్నది ఆదివాసులేనని ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివాసులను ఏరేసి అడవుల్లోని ఖనిజ సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టాలని కేంద్రం కుట్ర చేస్తున్నదని ఆరోపించారు. ఆపరేషన్ కగార్ మానవత్వానికి మచ్చ అని ఎంపీ మల్లు రవి పేర్కొన్నారు. రాజ్యాంగం కోరుకున్నదే మావోయిస్టులు కోరుకుంటున్నారని ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. 

కేంద్రం అంతం చేయాల్సింది రాజ్య అహంకారాన్ని అని సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం అన్నారు. ఆపరేషన్ కగార్ పేరిట ఆదివాసులను చంపడం అన్యాయమని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. కేంద్రాన్ని ప్రశ్నించినవాడినల్లా నక్సలైట్ గా ముద్ర వేస్తున్నారని ఆర్.నారాయణమూర్తి అన్నారు. రాజ్యాంగ హక్కుల కోసం పోరాడుతున్న మావోయిస్టులను ఆపరేషన్ కగార్ పేరిట అంతమొందిస్తున్నారని గద్దర్ కూతురు వెన్నెల ఆవేదన వ్యక్తం చేశారు.