
- వెంటనే అమలు చేయాలని డిమాండ్
- జనరల్ బాడీ మీటింగులు లేవు
- మరో ఏడాది మాత్రమే పదవీకాలం
- శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పెండింగ్ లోనే చాలా పనులు
హైదరాబాద్, వెలుగు : సిటీ శివారు మున్సిపాలిటీల్లో అభివృద్ధి, హామీలపై జనం వేసే ప్రశ్నలకు కార్పొరేటర్లు, కౌన్సిలర్లకు తలనొప్పి తయారైంది. 7 కార్పొరేషన్లు, 22 మున్సిపాలిటీల్లో నాలుగేళ్ల కిందట జరిగిన ఎన్నికల్లో కార్పొరేటర్లు, కౌన్సిలర్లు చాలా హామీలు ఇచ్చారు. ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే ఉంది. అయితే.. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో పాటు అభివృద్ధిపైనా జనాలు వెంటపడి ప్రశ్నిస్తున్న పరిస్థితి నెలకొంది. ఆఖరి ఏడాదిలోనైనా పనులు చేద్దామనుకుంటే పెద్దగా అయ్యేలా కనిపించడంలేదు. మేయర్లు, చైర్మన్లు, కార్పొరేటర్లు
కౌన్సిలర్ల మధ్య రాజకీయ విబేధాలు నెలకొనగా అభివృద్ధిపై చర్చించడంలేదు. నోరు విప్పితే ఎక్కడ అవిశ్వాస తీర్మానం పెడతారేమోనని మేయర్లు, చైర్మన్లు సైలెంట్ అయ్యారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో చాలామంది పార్టీలు మారారు. మరోవైపు ప్రభుత్వం కూడా మారింది. ప్రస్తుతం సీన్ అంతా రివర్స్ అయింది. చాలావరకు బీఆర్ఎస్ మేయర్లు, చైర్మన్లే ఉండగా కొన్నిచోట్ల జనరల్ బాడీ సమావేశాలు కూడా నిర్వహించడంలేదు.
అభివృద్ధి పనులు చేసేందుకు..
కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించకపోతుండగా జనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బోడుప్పల్, పీర్జాదిగూడ, జవహర్నగర్, నిజాంపేట్, బడంగ్పేట, బండ్లగూడ జాగీర్, మీర్పేట కార్పొరేషన్లతో పాటు 22 మున్సిపాలిటీలను గత బీఆర్ఎస్ సర్కార్ పెద్దగా పట్టించుకోలేదు. పన్నుల ద్వారా ఆదాయం వస్తున్నా ఒకటి, రెండు మున్సిపాలిటీల్లో తప్ప, మిగతా వాటిలో ఒక్కో కార్పొరేషన్ లో రూ.10 నుంచి రూ.20 కోట్ల వరకు, మున్సిపాలిటీల్లో రూ.5 నుంచి రూ.10 కోట్ల వరకు నిధులు ఉన్నాయి.
వీటిని అభివృద్ధి పనులకు ఖర్చు పెట్టేందుకు మేయర్లు, చైర్మన్లు ఆసక్తి చూపడంలేదు. కొన్నిచోట్ల సొంత పార్టీ సభ్యుల మధ్య విబేధాలతోనే చేయడంలేదు. మరికొన్నిచోట్ల అడ్డగోలుగా ఖర్చు చేస్తున్నారనే ఆరోపణలతో ఆపివేశారు. జనరల్ బాడీ మీటింగ్ ల్లోనూ సభ్యులకు మాట్లాడేందుకు చాన్స్ ఇవ్వడంలేదు. తూతూ మంత్రంగానే ముగిస్తున్నట్టు సొంత పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు. అభివృద్ధిపై కొత్త ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేయాల్సి ఉండగా కొన్నిచోట్ల మినహా చాలా చోట్ల అడగడంలేదు.
ఎన్నో హామీలు ఇచ్చినా..
కొత్తగా ఏర్పాటైన కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు పేరుకే ఉన్నాయి. తొలిసారి ఎన్నికలప్పుడు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో హామీలిచ్చింది. అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత పట్టించుకోవడం మానేసింది. నిధుల సాయం కూడా లేకపోగా ఎలాంటి అభివృద్ధి పనులు కొనసాగడం లేదు. కంకర తేలిన రోడ్లకు, కూలిన డ్రైనేజీలకు కూడా మరమ్మతులు చేయించలేని పరిస్థితి ఉంది. 2018 ఆగస్టులో ప్రభుత్వం కొత్త మున్సిపాలిటీలను ఏర్పాటు చేసింది. మేజర్పంచాయతీలను మున్సిపాలిటీలుగా మార్చింది.
వాటిలో చుట్టుపక్కల గ్రామాలను కూడా విలీనం చేసింది. అభివృద్ధి చెందుతామని జనం అనుకోగా.. తీరా చూస్తే పన్నులు పెరిగాయే తప్పితే అభివృద్ధి లేదు. విలీన గ్రామాల్లో ఎలాంటి మౌలిక వసతులు లేవు. ఎన్నికల్లో గెలిపిస్తే రోడ్లు, డ్రైనేజీలు నిర్మించి, పార్కులు కట్టిస్తామని, ఓపెన్జిమ్లు పెట్టిస్తామని లీడర్లు హామీలు ఇచ్చారు. గెలిచిన తర్వాత మర్చిపోయారు. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు సమీపిస్తుండగా హామీలను అమలు చేయాలని జనం నిలదీస్తూ.. ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది.