ఎండలు మండుతున్నా .. ఏసీ బస్సులు ఎక్కుతలేరు

ఎండలు మండుతున్నా .. ఏసీ బస్సులు ఎక్కుతలేరు
  • డెయిలీ ఆక్యుపెన్సీ 50 శాతానికి మించట్లే
  • చార్జీలు ఎక్కువ ఉండడం, డిమాండ్ ఉన్న రూట్లలో బస్సులు నడపకపోవడమే కారణం
  • ఎయిర్​పోర్టు రూట్లలో వన్ వే డిమాండ్

హైదరాబాద్, వెలుగు: గ్రేటర్​సిటీ పరిధిలో తిరుగుతున్న ఆర్టీసీ ఏసీ బస్సులు ఎక్కేందుకు జనం ఇంట్రస్ట్​చూపించడం లేదు. ప్రస్తుతం ఎండలు మండిపోతున్నా ఏసీ బస్సుల వైపు చూడడం లేదు. పెరుగుతున్న టెంపరేచర్లతో ఏసీ బస్సులకు డిమాండ్ ఉంటుందని ఆర్టీసీ అధికారులు భావించగా, పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఏసీ బస్సుల డెయిలీ ఆక్యుపెన్సీ రేషియో 50 శాతానికి మించట్లేదు. ఇటీవల మరిన్ని రూట్లలో కొత్తగా ఏసీ బస్సులు నడపాలనుకున్న అధికారులు పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. శంషాబాద్​ఎయిర్​పోర్టు రూట్లలో మాత్రమే ఏసీ బస్సులకు వన్​వే డిమాండ్ ఉంటోంది. 

219, 195 డబ్ల్యూ బస్సుల్లో ఆక్యూపెన్సీ రేషియో 50 శాతానికి మించట్లేదు. ఐటీ ఉద్యోగులను దృష్టిలో పెట్టుకొని ప్రారంభించిన ‘సైబర్ లైనర్స్’​ బస్సుల్లోనూ ఇంతే ఉంటోంది. డిమాండ్​ఉన్న రూట్లలో ఆర్టీసీ ఏసీ బస్సులు నడపకపోవడంతో జనం మెట్రో, క్యాబ్స్ ను ఆశ్రయిస్తున్నారు. ఆక్యుపెన్సీ రేషియో పెంచడానికి గ్రేటర్​ఆర్టీసీ అధికారులు ఇటీవల ఓ సమావేశం నిర్వహించారు. ఆక్యుపెన్సీ తగ్గడానికి గల కారణాలు, బస్సులు నడిచే రూట్లు, చార్జీలపై సమీక్షించారు.

వచ్చేటప్పుడు మాత్రమే 100% ఫుల్

మియాపూర్, జేబీఎస్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్​నుంచి డెయిలీ 49 ఏసీ బస్సులు శంషాబాద్​ఎయిర్​పోర్టుకు నడుస్తున్నాయి. ఇందులో కంటోన్మెంట్ డిపో నుంచి 29, మియాపూర్​–2 డిపో నుంచి 20 ఏసీ బస్సులు నడుస్తున్నాయి. అయితే ఎయిర్​పోర్టుకు వెళ్లేటప్పుడు ఆక్యుపెన్సీ అంతంత మాత్రంగానే ఉంటోంది. ఇందుకు ప్రధాన కారణం ప్రయాణికుల లగేజీ ఎక్కువగా ఉండడమే. వాటిని తీసుకొని బస్టాపుల్లోకి వచ్చి ఎయిర్​పోర్టుకు వెళ్లేందుకు జనం ఆసక్తి చూపించడం లేదు. ఖర్చు ఎక్కువైనా దాదాపు అంతా క్యాబ్​లు, ఓన్ వెహికల్స్ కు ప్రయారిటీ ఇస్తున్నారు. 

ఎయిర్ పోర్టు నుంచి సిటీకి వచ్చే బస్సులు మాత్రం 100 శాతం ఆక్యుపెన్సీ రేషియోతో నడుస్తున్నాయి. గతంలో ఆర్టీసీ బస్సులను ఎయిర్​పోర్టు అరైవల్​పాయింట్​వరకు మాత్రమే అనుమతించేవారు. ఇప్పుడు డిపార్చర్ వరకు బస్సులను అనుమతించడంతో ఎక్కువ మంది ఆర్టీసీ బస్సులు ఎక్కుతున్నారు. ఆర్టీసీ సిటీ బస్టాండ్ల నుంచి ఎయిర్​పోర్టుకు రూ.300 చార్జ్​చేస్తోంది. డెయిలీ ఈ రూట్​లో దాదాపు 6 వేల మంది జర్నీ చేస్తున్నారు. ఆర్టీసీకి రూ.14 లక్షల ఆదాయం వస్తోంది. 

డిమాండ్ ఉన్నా నడపట్లే

డిమాండ్​ఉన్న రూట్లలో ఆర్టీసీ ఏసీ బస్సులను నడపట్లేదనే విమర్శలు వస్తున్నాయి. మెజారిటీ బస్సులను ఐటీ కారిడార్​పరిధిలోనే నడుపుతున్నారని జనం మండిపడుతున్నారు. రద్దీ ఎక్కువగా ఉండే మెహిదీపట్నం – సికింద్రాబాద్​, ఎల్బీనగర్​– సికింద్రాబాద్, మియాపూర్​– కోఠి, మెహిదీపట్నం – కోఠి, ఉప్పల్– కూకట్​పల్లి రూట్లలో ఏసీ బస్సులు నడపాలని డిమాండ్ ఉన్నా ఆర్టీసీ పట్టించుకోవడం లేదు.

 ప్రస్తుతం కంటోన్మెంట్ డిపో నుంచి మొత్తం 38 ఏసీ బస్సులు నడుస్తుండగా, అందులో 29 బస్సులు ఎయిర్​పోర్టుకు, 9 బస్సులు సికింద్రాబాద్​ నుంచి కూకట్​పల్లి(219 రూట్)  మీదుగా పఠాన్​చెరు వరకు నడుస్తున్నాయి. మియాపూర్–2 డిపో నుంచి మొత్తం 27 ఏసీ బస్సులు నడుస్తుండగా, అందులో 20 బస్సులు ఎయిర్​పోర్టుకు, 7 బస్సులు హెచ్​సీయూ నుంచి హైటెక్​ సిటీ(195 డబ్ల్యూ) మీదుగా బాచుపల్లి క్రాస్​రోడ్​వరకు నడుస్తున్నాయి.

 అయితే 219, 195 డబ్ల్యూ రూట్లలో నడిచే 15 బస్సుల ఆక్యూపెన్సీ 50 శాతానికి మించట్లేదని తెలుస్తోంది. అలాగే ఐటీ ఉద్యోగుల కోసం సైబర్ లైనర్స్​పేరుతో రాయదుర్గం మెట్రో స్టేషన్​నుంచి వేవ్​ రాక్​, జీఏఆర్, డీఎల్ఎఫ్​ వరకు నడిచే 15 మినీ ఏసీ బస్సుల్లోనూ అనుకున్నంత ఆక్యుపెన్సీ రేషియో ఉండడం లేదు. ఆర్టీసీ అధికారులు మాత్రం ఏసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నారు.