ముంబై: పెట్రోల్ ఖర్చులను భరించడానికి ఇతర ఖర్చులు తగ్గించుకుంటున్నామని జనం చెబుతున్నారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, శ్రీనగర్ వంటి చోట్ల పెట్రోల్ లీటరు రేటు రూ.100 దాటగా, ముంబై వంటి సిటీల్లో రూ.97కు చేరింది. ఈ నేపథ్యంలో దేశమంతటా పెట్రో రేట్లపై లోకల్సర్కిల్స్ సర్వే చేసింది. బండిలో పెట్రోల్ పోయించుకోవడానికి మరింత ఎక్కువ డబ్బు పెడుతున్నామని వెహికిలిస్టులు చెప్పారు. పెట్రోల్ ఖర్చును భరించడానికి ఇతర ఖర్చులను తగ్గించుకుంటున్నామని 51 శాతం మంది రెస్పాండెంట్లు ఈ సర్వేలో వెల్లడించారు. సర్వే కోసం 291 జిల్లాలకు చెందిన 22 వేల మంది రెస్పాండెంట్ల నుంచి వివరాలు సేకరించారు. పెట్రోల్, డీజిల్ రేట్లను వెంటనే తగ్గించేందుకు, తమ తమ రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ను తగ్గించాలని 79 శాతం మంది అన్నారు.
పెట్రో ప్రొడక్టుల రేట్లలో 23 శాతం వరకు రాష్ట్రాల వ్యాట్ ఉంటుంది. ఇప్పుడున్న వ్యాట్ మోడల్ బాగానే ఉందని ఎనిమిది శాతం మంది చెప్పగా, 13 శాతం మంది తమకు ఈ విషయం గురించి తెలియదని అన్నారు. పెరుగుతున్న పెట్రోల్ ఖర్చులను ఎలా తట్టుకోగలుగుతున్నారనే ప్రశ్నను కూడా సర్వేలో రెస్పాండెంట్లకు వేశారు. గత 12 నెలలు నుంచి పొదుపును కొద్దిగా పెంచామని, ఆ డబ్బును పెట్రోల్ కోసం వాడుతున్నామని 3 శాతం మంది చెప్పారు. కిందటి ఏడాది కాలంలో దాచుకున్న సేవింగ్స్ను వాడుతున్నామని మరికొందరు తెలిపారు. కిరాణా వంటి ఎసెన్షియల్ వస్తువులపై ఖర్చు తగ్గించుకున్నామని 21 శాతం మంది బాధతో చెప్పారు. ఇంటి నుంచే పని చేయడం వల్ల పెట్రోల్ బిల్ తగ్గిందని 43 శాతం మంది చెప్పగా, బిల్లు జీరో అయిందని రెండు శాతం మంది అన్నారు.
ఇన్డైరెక్ట్ ట్యాక్సులు తగ్గాలి: దాస్
పెట్రో రేట్లను జనం భరించేస్థాయికి తేవాలంటే వాటిపై ఇన్డైరెక్ట్ ట్యాక్సులను తగ్గించాలని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. పెట్రో రేట్లు పెరగడం వల్లే గత డిసెంబరులో కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్ ఇన్ఫ్లేషన్ 5.5 శాతానికి చేరిందని అన్నారు. ట్రాన్స్పోర్ట్, హెల్త్కేటగిరీ సేవల రేట్లు పెరిగాయని అన్నారు. పెట్రో రేట్లను తగ్గించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నించాలని, పన్నుల భారం తగ్గించాలని దాస్ స్పష్టం చేశారు. పెట్రోల్ ధరలో 60 శాతం, డీజిల్ ధరలో 54 శాతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ట్యాక్సులు ఉన్నాయని పేర్కొన్నారు. పెట్రో ప్రభావం ఇతర రంగాలన్నింటిపైనా పడుతుందనే విషయం తెలిసిందే.