అభిమానులు నన్ను అత్యంత దురదృష్టకర క్రికెటర్ అని పిలుస్తారు: సంజు శాంసన్

అభిమానులు నన్ను అత్యంత దురదృష్టకర క్రికెటర్ అని పిలుస్తారు: సంజు శాంసన్

ఆసియా కప్ 2023(పాకిస్తాన్, శ్రీలంక).. ఆసియా క్రీడలు 2023(చైనా).. వరల్డ్ కప్ 2023(భారత్). మూడు వేరువేరు టోర్నీలు.. మూడు వేరువేరు జట్లు. వీటిలో ఏ ఒక్కదానిలో చోటు దక్కించుకొని ఏకైక క్రికెటర్.. సంజు శాంసన్. మరి ఇతడిని దురదృష్టవంతుడు అని కాకుండా మరెలా పిలవాలో మీరే చెప్పండి. పోనీ ఇప్పుడు జరుగుతున్న ఇండియా- ఆస్ట్రేలియా టీ20 సిరీస్ కైనా ఎంపిక చేశారా! అదీ లేదు. అతనికి మొండిచేయి చూపడం సెలక్టర్లకు పరిపాటి అయితే.. వారిని అడ్డగోలుగా తిట్టడం అతని అభిమానులకు పరిపాటి.

అవకాశం వచ్చిన ప్రతి మ్యాచ్‌లోనూ రాణించడమంటే ఏ క్రికెటర్‌కు సాధ్యం కాదు.. అందుకు శాంసన్ కూడా అతీతుడే. జట్టులో అవకాశం వచ్చిన ప్రతీసారి వరుస సెంచరీలు చేయలేదు. భారీ ఇన్నింగ్స్ ఆడలేదు. అతని ప్రదర్శనను బట్టి 80 శాతం మేర సక్సెస్ అయ్యాడనే చెప్పుకోవాలి. అయినప్పటికీ అతనికి అవకాశాలు రావు. ఏడాదికి ఒకసారో.. రెండుసార్లు అలా కనిపిస్తుంటాడు. అవి కూడా ఐర్లాండ్, జింబాబ్వే వంటి విదేశీ టూర్లు. తాజాగా, ఇదే విషయపై హోస్ట్ అతన్ని ప్రశ్నించగా విస్తుపోయే సమాధానమిచ్చాడు.

ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్ కు శాంసన్‌ను ఎంపిక చేయకపోవడాన్ని పార్లమెంటు సభ్యుడు శశి థరూర్ తప్పుబట్టిన విషయం తెలిసిందే. ఇదొక అన్యాయమైన చర్యగా ఆయన పేర్కొన్నారు. ఇదే విషయాన్ని  ఒక ఇంటర్వ్యూలో హోస్ట్ శాంసన్ ముందు ప్రస్తావించగా అతడు అదేమి లేదని కొట్టిపారేశాడు.  

"ప్రజలు నన్ను అత్యంత దురదృష్టకర క్రికెటర్ అని పిలుస్తారు.. కానీ నాకు అలా అనిపించడం లేదు.. ప్రస్తుతం నేను ఏ స్థాయిని  చేరుకున్నానో నాకు తెలుసు.. అనుకున్నదానికంటే ఇది చాలా ఎక్కువ అని నేను అనుకుంటాను.." అని శాంసన్ మాట్లాడారు. అందుకు సంభందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

కాగా, ప్రస్తుతం శాంసన్ విజయ్ హజారే ట్రోఫీలో కేరళ తరపున ఆడుతున్నాడు.