హైదరాబాద్​ చుట్టూ గాయబ్​

 హైదరాబాద్​ చుట్టూ గాయబ్​
  • లీడర్లు, ఆఫీసర్లు మిలాఖత్​.. అధికారం అండతో కబ్జాలు
  • బఫర్​ జోన్లలో నిర్మాణాలు.. నామ్కేవాస్తేగా లేక్ ప్రొటెక్షన్​ కమిటీలు

హైదరాబాద్​, వెలుగు: ఒకప్పుడు ‘సిటీ ఆఫ్​ లేక్స్’​గా పేరున్న హైదరాబాద్​లో ఇప్పుడు ఏ చెరువు చూసినా కబ్జాలే. అధికారం అండతో కొందరు.. జబర్దస్తీతో మరికొందరు కనిపించినకాడికి ఆక్రమించుకుంటున్నరు. వేల కోట్ల విలువైన భూములను మాయం చేస్తున్నరు. పొలిటీషియన్లు, రియల్​ ఎస్టేట్​ వ్యాపారులు,  అధికారులు సిండికేట్​గా మారి లేక్స్​ను లే అవుట్లుగా మారుస్తున్నరు.  

ఆ చెరువులు ఏమైనయ్​?
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు హెచ్​ఎండీఏ, జీహెచ్​ఎంసీ పరిధుల్లో 2,857 చెరువులుండగా.. ఇప్పుడు 2,380  మాత్రమే ఉన్నాయి. అధికారుల లెక్కల ప్రకారం 275 చెరువులు ఔటర్​ రింగ్ రోడ్డు (ఇన్​సైడ్​, ఔట్​సైడ్) నిర్మాణంలో కలిసిపోయాయి. మరో 202 లేక్స్​కు సంబంధించి లెక్కా పత్రం లేదు. ఆ చెరువులన్నీ కబ్జాదారుల చెరలోకి వెళ్లాయి. అధికారులు సక్రమంగా సర్వే చేస్తే మాయమైన చెరువుల లిస్టు ఇంకా పెరగొచ్చని పర్యావరణ వేత్తలు అంటున్నారు. రాజధాని​చుట్టూ శివారు ప్రాంతాలను కలిపి 7,257 కిలోమీటర్ల పరిధిలో హైదరాబాద్​ మెట్రోపాలిటన్​ డెవలప్​మెంట్​ అథారిటీ (హెచ్​ఎండీఏ) విస్తరించి ఉంది. దీని పరిధిలోని నలు దిక్కులా ఉన్న ప్రధాన చెరువుల్లో మెజార్టీ భాగాలు కబ్జాకు గురయ్యాయి. ఎఫ్​టీఎల్​, బఫర్​ జోన్లలో అక్రమ కట్టడాలు వెలిశాయి. వెలుస్తూనే ఉన్నాయి. సిటీ శివారులో గజం జాగా రూ. 40 వేల నుంచి రూ. లక్ష పలుకుతుండటంతో అధికారుల అండదండతో చెరువులను ఆక్రమించుకొని బిజినెస్​ చేస్తున్నారు. 

ఎల్లమ్మ చెరువు కట్టకు పక్కనే పెట్రోల్​ బంకు
శేరిలింగంపల్లిలోని 141 సర్వే నెంబర్​లో ఉన్న ఎల్లమ్మ చెరువు పదేండ్ల కిందటి దాకా 41 ఎకరాల్లో ఉండేది. ఇప్పుడది 23 ఎకరాలకు తగ్గింది. ఇక్కడ అక్రమ కట్టడాలు, కబ్జాలకు లెక్కేలేదు. నాలాలు, బఫర్​ జోన్ల ఆనవాళ్లు కూడా కనిపించడం లేదు. చెరువు కట్టకు అతి సమీపంలోనే పెట్రోల్​ బంకు నిర్మాణం జరుగుతున్నది. రూల్స్​ ప్రకారం చెరువుల దగ్గర ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదు. కానీ ఇక్కడ నాలాను పైపులతో కప్పేసి వాటిమీదే బంకు నిర్మాణం జరుపుతున్నారు. ఇదే ఏరియాలో గుర్నాథం చెరువు పదేండ్ల కింద 50 ఎకరాల వరకు ఉండేది. ఇప్పుడది 15 ఎకరాలకే పరిమితైంది. కూకట్​పల్లిలోని కిందికుట చెరువు పదేండ్ల కిందటి వరకు 30 ఎకరాల వరకు ఉండేది. ఇప్పుడది 8 ఎకరాలకు చేరింది. కూకట్​పల్లిలోని అంబీర్​ చెరువు పరిస్థితీ ఇట్లనే ఉంది. అధికార పార్టీ ఎమ్మెల్యే ఒకరు మోతీనగర్​లోని సర్వే నంబర్​ 57లో ఉన్న అంబీర్​ చెరువు గొలుసుకట్టు చెరువును కబ్జా చేశారని స్థానికులు బాహాటంగానే చెప్పుకుంటారు. 

కళ తప్పిన కాముని చెరువు
రియల్​ ఎస్టేట్ కు హబ్​ అయిన శంషాబాద్​లో చారిత్రక కాముని చెరువు కళ తప్పింది. నేషనల్​ హైవేకు అతి దగ్గరగా ఉన్న ఈ చెరువు ఒకప్పుడు 50 ఎకరాల్లో ఉండేది. ఇప్పుడది సగానికి తగ్గింది. ఈ చెరువును ఆనుకొని వ్యాపార సంస్థలు వెలిశాయి. హోటళ్లు, ఇతర వ్యాపార సముదాయాల్లోని వ్యర్థ పదార్థాలన్నీ ఇందులో పారేయడంతో చేపల మనుగడ కష్టమైంది. శివరాంపల్లిలో ఉన్న రుక్–ఉద్​–దవ్లా చెరువుకు 250 ఏండ్ల చరిత్ర ఉంది. 40 ఎకరాల్లో ఉండే ఈ చెరువు చుట్టు పక్కల ప్రజల దాహార్తిని తీర్చేది. కానీ ఇప్పుడది కమర్షియల్​ కట్టడాలకు నిలయంగా మారి 8 ఎకరాల్లో ఉంది. ఈ చెరువుపై గ్రీన్​ ట్రిబ్యునల్​లో కేసు నడుస్తున్నది.

అలుగులు కూడా పగుల కొట్టి
బోయిన్​పల్లి, లింగంపల్లి పరిధుల్లోని పలు చెరువుల అలుగులను పగులగొట్టి కబ్జాలకు పాల్పడ్డారు. కొందరు నేతలు, అధికారులు, కబ్జాకోరులు ఒక్కటై ఇదంతా నడిపిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అస్మత్​పేట, రామన్నకుంట, నల్లగండ్ల, గోపి చెరువుల్లోని వందలాది ఎకరాల భూములు బిజినెస్ హబ్​లుగా మారాయి. గోపి చెరువు ఏకంగా 60 ఎకరాల వరకు కబ్జా అయింది. ఇప్పుడు ఆ చెరువు 12 ఎకరాలకే పరిమితమైంది. 

నామ్కేవాస్తేగా ఎల్​పీసీ
చెరువుల పర్యవేక్షణ, పునరుద్ధరణ, కబ్జాల నియంత్రణ, సుందరీకరణ, ఎఫ్​టీఎల్​, బఫర్​ జోన్ల గుర్తింపు, బౌండరీల ఏర్పాటు కోసం  రెవెన్యూ, ఇరిగేషన్​, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్​, పొల్యూషన్​ కంట్రోల్​ బోర్డు అధికారులతో ఏర్పాటు చేసిన లేక్ ప్రొటెక్షన్​ కమిటీ (ఎల్​పీసీ)లు నామ్కేవాస్తేగా పనిచేస్తున్నాయి. చెరువుల భూముల్లో బంగ్లాలు వెలుస్తున్నా  పట్టించుకోవడం లేదు. చెరువుల చుట్టు పక్కల నివసించే ప్రజలు మురుగును నేరుగా చెరువుల్లోకే వదులుతున్నారు. దీంతో ఇక్కడి నీళ్లు ఎందుకూ పనికిరాకుండా పోతున్నాయి. ఆ వాసనకు చెరువుల చుట్టూ నడవడానికి కూడా జంకాల్సిన పరిస్థితి. సుందరీకరణ పనుల జాడే లేదు.  మాయమైన చెరువులతోపాటు ఇప్పుడున్న చెరువులు చాలా వరకు ధరణి పోర్టల్ లో ప్రొహిబిటెడ్​ లిస్టులో చేర్చకపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది. 

20 వేల కోట్ల పైమాటే
మార్కెట్​ విలువను బట్టి హైదరాబాద్​ చుట్టుపక్కల 30 కిలో మీటర్లలోపు గజం జాగా రూ. 30 వేల నుంచి లక్ష దాకా పలుకుతున్నది. ఎకరం విలువ రూ.10 కోట్ల నుంచి 50 కోట్లు ఉంది. ఒక్కో చెరువులో ఎకరం నుంచి 10 ఎకరాల వరకు కబ్జాకు గురైనా.. ఆ కబ్జా భూమితోపాటు  మాయమైన 202 చెరువుల విలువ రూ. 20 వేలకోట్ల దాకా ఉంటుంది. 

భవిష్యత్​ తరాలకు కష్టమే
ఒకప్పుడు హైదరాబాద్​ చెరువులు తాగునీరు, సాగునీరుకు, మత్స్యకారులు చేపలు పట్టుకునేందుకు ఉపయోగపడేవి. వర్షాలు పడ్డప్పుడు వరదలు రాకుండా కాపాడేవి. చెరువుల కబ్జాతో నిరుడు వరదలు వచ్చినప్పుడు నగరం అతాలకుతలమైంది. కబ్జాలు, అక్రమ కట్టడాలతో విస్తీర్ణం తగ్గి.. వ్యర్థాలతో నిండిపోయాయి. చెరువులను కాపాడుకోకపోతే భవిష్యత్​ తరాలకు కష్టమే. 
- బీవీ సుబ్బారావు, పర్యావరణ వేత్త

ప్రశ్నిస్తే వార్నింగ్ ఇస్తున్నరు
చెరువుల కబ్జాలపై ప్రశ్నించినా, కోర్టులను ఆశ్రయించినా కబ్జాదారుల నుంచే కాదు అధికారుల నుంచి కూడా వార్నింగ్​లు వస్తున్నాయి. ఎల్లమ్మ చెరువు కబ్జాపై కోర్టును ఆశ్రయించిన బాలస్వామి అనే సామాన్యుడ్ని ఆఫీసర్లు, ఎంక్రోచ్​ చేసిన వాళ్లు బెదిరించారు. ప్రభుత్వం కబ్జాలను అరికట్టి చెరువులను కాపాడాలి. 
- జి.యోగానంద్​,  ఫౌండర్​, సిటిజన్​ కన్సల్టేషన్​ సెంటర్

కట్టమైసమ్మ సాక్షిగా..!
మేడ్చల్​ జిల్లా జీడిమెట్ల–సూరారం కట్ట మైసమ్మ చెరువు పదేండ్ల కిందటి వరకు 60 ఎకరాల్లో ఉండేది. ఇప్పుడది 20 ఎకరాలు కూడా లేదు. ఈ చెరువులో అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి దాదాపు 20 ఎకరాలకుపైగా ఆక్రమించి తన వ్యాపార సామ్రాజాన్ని విస్తరిస్తున్నారు. నాలాలు, ఎఫ్​టీఎల్​, బఫర్​ జోన్​ మొత్తాన్ని ఆక్రమించారు. ఈయన అండతో ఇంకొందరు కన్ స్ట్రక్షన్స్​ చేస్తున్నారు. నిజానికి ఈ భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదు.