మామిడి ధర రూ.40వేలకు డమాల్ 

మామిడి ధర రూ.40వేలకు డమాల్ 

మామిడి మార్కెట్​లోనూ దళారుల రాజ్యం నడుస్తోంది. నెల కిందే మామిడి సీజన్ మొదలు కాగా,​హైదరాబాద్​ బాట సింగారం మార్కెట్​లో టన్నుకు  రూ.70 వేల నుంచి 90 వేలకు పైగా రేటు పెట్టిన వ్యాపారులు ఇప్పుడు రూ.35 వేల నుంచి రూ.40 వేలు మాత్రమే చెల్లిస్తున్నారు. దీంతో గిట్టుబాటు కాక మామిడి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉత్తర తెలంగాణలో కీలకమైన జగిత్యాల చల్​గల్ మ్యాంగో మార్కెట్​లోనూ ఇదే పరిస్థితి ఉంది. ఈ నెల 15  నుంచి మార్కెట్​లో మామిడి కోనుగోళ్లు మొదలు కాగా, మొదట్లో క్వింటాల్​కు రూ. 5,500 నుంచి రూ. 6,500  దాకా పెట్టిన కమీషన్ ఏజెంట్లు ప్రస్తుతం రూ.3 వేల నుంచి రూ. 4 వేలు కూడా పెట్టడం లేదని రైతులు వాపోతున్నారు. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్​​జిల్లాలకు చెందిన రైతులు  మహారాష్ట్రలోని నాగ్​పూర్​కు పంటను తీసుకెళ్తున్నారు.

పసుపునూ వదల్లే.. 

ఈ సీజన్​లో రూ.20 వేల దాకా పలికిన పసుపు రేటు వ్యాపారుల మాయాజాలంతో క్రమంగా తగ్గిపోతోంది. పసుపు మార్కెట్​కు కేరాఫ్​గా చెప్పుకునే నిజామాబాద్​ గంజ్​లో బుధవారం క్వింటాల్ పసుపు రేట్ రూ.13 వేలు పలకగా, సేమ్​ టైం మహారాష్ట్ర సాంగ్లీలో మాత్రం రూ.16,500 ధర ఉన్నది. నెల కింద ఊహించని రీతిలో సాంగ్లీలో రూ.20 వేలకు మించి రేట్ చెల్లించినా మన దగ్గర మాత్రం ఆ ధర పెట్టలేదు. పైగా నిజామాబాద్, మెట్​పల్లి లాంటి మార్కెట్లలో  పసుపు కొనే ట్రేడర్లు 2 శాతం కమీషన్​తో పాటు తక్షణ బిల్ పేమెంట్​ పేరుతో ఒకటిన్నర శాతం కోత పెడ్తారు. మహారాష్ట్ర లోని సాంగ్లీలో అసలు కమీషన్, కటింగ్ లేదు. దీంతో ఈ సీజన్​లో చాలా మంది రైతులు మహారాష్ట్రలోని సాంగ్లికి వెళ్లి  పసుపు అమ్ముకుంటున్నారు.

Also Read: మిర్చికి రేటు పెట్టరు.. దాచుకోనియ్యరు