
- యూఎస్ ఏఐ కంపెనీతో పార్టనర్షిప్ కుదుర్చుకున్న టెలికం కంపెనీ
న్యూఢిల్లీ: తన కస్టమర్లకు ఏఐ ఆధారిత సర్వీస్లను అందించేందుకు భారతి ఎయిర్టెల్ యూఎస్ కంపెనీ పెర్ప్లెక్సిటీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం కింద తన 36 కోట్ల కస్టమర్లకు (మొబైల్, వైఫై, డీటూహెచ్) పెర్ప్లెక్సిటీ ప్రో సబ్స్క్రిప్షన్ను ఒక ఏడాది పాటు ఉచితంగా అందివ్వనుంది. సాధారణంగా పెర్ప్లెక్సిటీ ప్రో సబ్స్క్రిప్షన్ కాస్ట్ ఏడాదికి రూ.17 వేల దగ్గర ఉంటుందని అంచనా.
ఏఐ ఆధారిత సెర్చ్ ఇంజిన్ సర్వీస్లను ఈ కంపెనీ అందిస్తోంది. ఎయిర్టెల్ కస్టమర్లు పెర్ప్లెక్సిటీ అందించే డీప్ రీసెర్చ్, ఫైల్ అప్లోడ్, ఇమేజ్ జనరేషన్, జీపీటీ4.1, క్లాడ్ వంటి ఏఐ మోడల్స్ను వాడుకునే వీలుంటుంది. ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్లో లాగిన్ అయ్యి ఈ ఆఫర్ను వాడుకోవచ్చు. ఎయిర్టెల్ షేర్లు గురువారం 0.40 శాతం తగ్గి రూ.1,929 వద్ద ముగిశాయి. కొత్త కస్టమర్లను ఆకర్షించడంలో కంపెనీకి ఈ పార్టనర్షిప్ సాయపడొచ్చు.
ఎటువంటి ఖర్చు లేకుండా కోట్ల మంది యూజర్లు పవర్ఫుల్ ఏఐ టూల్స్ను వాడుకోవడానికి ఈ భాగస్వామ్యం సాయపడుతుందని ఎయిర్టెల్ ఎండీ గోపాల్ విట్టల్ అన్నారు. పెర్ప్లెక్సిటీ సీఈఓ అరవింద్ శ్రీనివాస్ మాట్లాడుతూ, ఈ భాగస్వామ్యం భారత్లో విద్యార్థులు, ప్రొఫెషనల్స్, గృహిణులకు నమ్మకమైన ఏఐని అందుబాటులోకి తెస్తుందని తెలిపారు.