దర్గాకు వెళ్దామని చెప్పి.. యువకుడి దారుణ హత్య

దర్గాకు వెళ్దామని చెప్పి.. యువకుడి దారుణ హత్య

గండిపేట, వెలుగు: దర్గాకు వెళ్దామని నమ్మించి ఇంట్లో నుంచి బయటకు రప్పించి ఓ వ్యక్తిని తన మిత్రుడే దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన రాజేంద్రనగర్‌‌ పోలీస్‌‌ స్టేషన్‌‌ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎంఎంపహాడీ ప్రాంతానికి చెందిన మహ్మద్‌‌ ఆజామ్‌‌ ఆలీ(24) కారు డ్రైవర్‌‌. ఇదే ప్రాంతానికి చెందిన ముజాహిద్‌‌ అనే యువకుడితో కలిసి సిటీలోని పలు ప్రాంతాల్లో పార్కు చేసిన వెహికల్స్​ను చోరీ చేసి అమ్ముతుండేraవారు. చోరీ కేసుల్లో జైలుకు వెళ్లిన ఇద్దరూ ఇటీవలే బెయిల్‌‌పై బయటకు వచ్చారు. కాగా డబ్బు పంపకాల విషయంలో ఈ ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో అజామ్​అలీని చంపేయాలని ముజాహిద్ ​ప్లాన్​ వేశాడు. ఆదివారం రాత్రి ఇంట్లో ఉన్న ఆజామ్‌‌కు ఫోన్‌‌ చేసి దర్గాకు వెళ్దామని చెప్పి బయటకు రప్పించాడు. 

ఇద్దరు కలిసి గోల్డెన్‌‌ హైట్స్‌‌  జనచైతన్య వెంచర్‌‌ ప్రాంతంలోని ఖాళీ ప్రదేశంలోకి వెళ్లి మద్యం తాగారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య గొడవ జరగ్గా.. ఆజామ్‌‌పై ముజాహిద్‌‌ కత్తి, బండరాళ్లతో దాడి చేసి హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని డెడ్​బాడీని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.