
పోలీసుల సోదాలు ఆపాలి
హైకోర్టులో పిల్.. నేడు విచారించనున్న చీఫ్ జస్టిస్ డివిజన్ బెంచ్
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ సిటీ పోలీసులు అర్ధరాత్రి వేళ చేస్తున్న కార్డన్ అండ్ సెర్చ్ ఆపాలని హైకోర్టులో పిల్ దాఖలైంది. సామాజిక కార్యకర్త ఎస్క్యూ మక్సూద్ ఈ పిటిషన్ వేశారు. పోలీసుల సోదాలతో పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతోందని పేర్కొన్నారు. కాగా, ఈ పిటిషన్పై చీఫ్ జస్టిస్ డివిజన్ బెంచ్ బుధవారం విచారణ చేపట్టనుంది. ‘‘కార్డన్ అండ్ సెర్చ్ కు చట్టంలో ఆస్కారం లేదు. పోలీసులు ప్రతి ఒక్కరినీ దోషులుగా భావించడానికి వీల్లేదు.
2023, మే 31న పోలీసులు జారీ చేసిన విధానాలు చట్ట వ్యతిరేకం. నిబంధనలకు విరుద్ధంగా రాత్రి 10.30 గంటలకు కొన్ని ప్రాంతాల్లో దుకాణాలు, హోటళ్లు, చిన్న, వీధి వ్యాపారులను బలవంతంగా మూసివేయిస్తున్నారు. కేఫ్లకు వచ్చిన వ్యక్తులను తనిఖీలు చేస్తున్నారు. తినుబండారాలు, టిఫిన్లు తింటున్న వారిని బెదిరిస్తున్నారు. సరైన కారణం లేకుండా ఓ వ్యక్తిని తనిఖీ చేయడం అతని హక్కులకు భంగం కలిగించడమే. కొందరు ఈ తనిఖీలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ఇది మరింత దారుణమైన విషయం. వారి వ్యక్తిగత గోప్యతను దెబ్బతీయడమే’’ అని పిటిషన్లో పేర్కొన్నారు.