- పల్లెబాట పడదాం!
- గ్రామీణ ప్రాంతాలపై రిటైలర్ల నజర్
- పెట్రోల్ బంకుల పెంపునకు ఏర్పాట్లు
న్యూఢిల్లీ: కరోనా టౌన్లను, సిటీలను భారీ దెబ్బకొట్టినప్పటికీ, పల్లెలు మాత్రం నిలదొక్కుకోగలిగాయి. ఈసారి వర్షాలు బాగా పడటం, దిగుబడులు మెరుగ్గా ఉండటం, రూరల్ డిమాండ్ను పెంచడానికి ప్రభుత్వం చాలా చర్యలు ప్రకటించడం ఇందుకు కారణాలు. అందుకే గ్రామాల జనం కొనుగోలు శక్తి తగ్గలేదు. ఈ పరిస్థితి క్యాష్ చేసుకోవడానికి భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వంటి కంపెనీలు రంగంలోకి దిగాయి. పల్లెటూళ్లలో మరిన్ని పెట్రోల్ బంకులను ఏర్పాటు చేస్తున్నాయి. గత మార్చి నుంచి లాక్డౌన్ విధించడం వల్ల టౌన్ల, సిటీల వెహికల్స్ ఇండ్ల నుంచి బయటికి రాలేదు. రోడ్లన్నీ ఖాళీగా కనిపించాయి. దీంతో పెట్రోల్ బంకుల ఆదాయాలు పడిపోయాయి. పల్లెటూళ్లపై రిస్ట్రిక్షన్ల ఎఫెక్ట్ పెద్దగా లేకపోవడంతో ఎప్పట్లాగే వ్యాపారాలు నడిచాయి. రైతుల, లేబర్ల జేబుల్లోకి కాస్త డబ్బు వచ్చి చేరింది. అందుకే గ్రామీణ ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల సంఖ్యను పెంచడంపై కంపెనీలు ఫోకస్ చేస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఈ ఏడాది ఔట్లెట్ల సంఖ్యను బాగా పెంచుతామని మనదేశంలోని రెండు అతిపెద్ద ఆయిల్ రిటైలర్లు హిందుస్థాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం ప్రకటించాయి. ‘‘ఫస్ట్ లెవెల్ సిటీల్లో బంకులు తగినన్ని ఉన్నాయి. రూరల్ ఏరియాల్లో డిమాండ్ పెరుగుతోంది. మాకు పల్లె ప్రాంతాల్లో చాలా అవకాశాలు ఉన్నాయి’’ అని హెచ్పీ చైర్మన్ ముకేశ్ కుమార్ సురానా వివరించారు.
వ్యవ‘సాయం’పై గంపెడాశలు
కరోనాతో విలవిలలాడుతున్న మన ఎకానమీని వ్యవసాయ రంగం గట్టెక్కిస్తుందని కేంద్రం ఆశలు పెట్టుకుంది. గ్రామీణ ప్రాంతాల నుంచి ట్రాక్టర్లకు, వ్యవసాయ పరికరాలకు డిమాండ్ పెరుగుతోంది. తాజా క్వార్టర్లో మహీంద్రా ట్రాక్టర్స్ వంటి వ్యవసాయ రంగం కంపెనీల ఫైనాన్షియల్ రిజల్ట్స్ బాగుండటమే ఇందుకు నిదర్శనం. అర్బన్ కంటే రూరల్ సెక్టర్ బాగుందన్న మాట నిజమేనని అంబుజా సిమెంట్స్ సీఈఓ నీరజ్ అఖోరీ చెప్పారు. పెట్రోల్ అమ్మకాల్లో హెచ్పీ, బీపీ, ఐఓసీ ఔట్లెట్ల వాటాయే 90 శాతం వరకు ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో వీటి సర్వీస్ స్టేషన్ల సంఖ్య గత జనవరిలో 24.8 శాతం ఉండగా, ఈ జనవరిలో 26.8 శాతానికి చేరింది. ఈ ఏడాది బంకుల సంఖ్య మరింత పెరగనుంది. బీపీ గత ఏడాది 2,212 పెట్రోల్ బంకులను ఏర్పాటు చేయగా, వీటిలో మూడింట రెండొంతులు గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. మిగతా కంపెనీలు కూడా ఇదే బాటలో నడుస్తున్నాయి.