
- సీఎం రేవంత్రెడ్డితో కంపెనీ ప్రతినిధుల కీలక చర్చలు
- హైదరాబాద్లో మాన్యుఫాక్చరింగ్
- హబ్ నెలకొల్పనున్నట్టు ప్రకటన
- ఇక్కడి నుంచే ప్రపంచస్థాయి
- ఔషధాల తయారీ.. సేవల విస్తరణ
- ఫార్మా రంగంలో మరో మైలురాయి..
- వేలాది మందికి ఉద్యోగావకాశాలు
- తెలంగాణకు ఇది గర్వ కారణం: సీఎం రేవంత్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రూ. 9వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచంలోనే పేరొందిన అమెరికా ఫార్మా దిగ్గజ కంపెనీ ఎల్ లిల్లీ ముందుకొచ్చింది. దేశంలోనే మొదటిసారిగా తమ మాన్యుఫాక్చరింగ్ హబ్ను హైదరాబాద్లో నెలకొల్పనున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో ప్రపంచవ్యాప్తంగా తమ ఔషధాల సరఫరా సామర్థ్యాన్ని విస్తరించనున్నది.
సోమవారం హైదరాబాద్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్రెడ్డితో ఎల్ లిల్లీ కంపెనీ ప్రతినిధులు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఎల్ లిల్లీ సంస్థ ప్రెసిడెంట్ ప్యాట్రిక్ జాన్సన్, కంపెనీ ఇండియా ప్రెసిడెంట్ విన్సెలో టుకర్, ప్రత్యేక కార్యదర్శి సంజయ్ కుమార్, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్రెడ్డి పాల్గొన్నారు.
సీఎంతో చర్చల అనంతరం ఎల్ లిల్లీ కంపెనీ తమ విస్తరణ ప్రణాళికలు, తెలంగాణలో భారీ పెట్టుబడులకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో దేశంలో అధునాతన తయారీ యూనిట్ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్లో ఏర్పాటు చేసే మాన్యుఫాక్చరింగ్, క్వాలిటీ హబ్ తమకు అత్యంత కీలకమైందని తెలిపింది. ఇక్కడి నుంచే దేశంలో ఉన్న ఎల్ లిల్లీ కాంట్రాక్ మాన్యుఫాక్చరింగ్ నెట్వర్క్ సాంకేతిక పర్యవేక్షణ, నాణ్యత నియంత్రణ, అధునాతన సాంకేతిక సామర్థ్యాలను అందించనున్నది.
కాగా, విస్తరణలో భాగంగా ఎల్ లిల్లీ కంపెనీ భారీ పెట్టుబడులకు ముందుకు రావడం ఆనందంగా ఉందని, తెలంగాణకు ఇది గర్వ కారణమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణపై నమ్మకం ఉంచినందుకు కంపెనీ ప్రతినిధులను అభినందించారు. పెట్టుబడులతో వచ్చే కంపెనీలు, పరిశ్రమలకు తమ ప్రభుత్వం అన్ని రకాలుగా మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. హైదరాబాద్ ఇప్పటికే దేశంలోనే ఫార్మా హబ్గా పేరొందిందని, ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తుందని అన్నారు.
హైదరాబాద్ కేంద్రంగా కొత్త ఆవిష్కరణలు..
అమెరికాకు చెందిన ఎల్ లిల్లీ కంపెనీ 150 ఏండ్లుగా ప్రపంచవ్యాపంగా ఔషధాల తయారీ రంగంలో విశేషమైన సేవలను అందిస్తున్నది. మేక్ ఇన్ ఇండియా లక్ష్యానికి తగ్గట్టుగా దేశంలో తొలిసారిగా ఏర్పాటు చేస్తున్న అధునాతన యూనిట్.. తెలంగాణను అత్యాధునిక ఆరోగ్య పెట్టుబడుల గమ్యస్థానంగా నిలబెట్టనున్నది. ప్రధానంగా డయాబెటిస్, ఒబెసిటీ, అల్జీమర్స్, క్యాన్సర్, ఇమ్యూన్ వ్యాధులకు సంబంధించిన ఔషధాలు, కొత్త ఆవిష్కరణలపై ఈ కంపెనీ పని చేస్తుంది.
ఇండియాలో ఇప్పటికే గురుగ్రామ్, బెంగళూరులో ఎల్ లిల్లీ కంపెనీ కార్యకలాపాలు కొనసాగిస్తున్నది. హైదరాబాద్లో ఈ ఏడాది ఆగస్టులోనే గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ను ప్రారంభించింది. కాగా, వీలైనంత తొందరలోనే కెమిస్టులు, అనలిటికల్ సైంటిస్టులు, క్వాలిటీ కంట్రోల్, మేనేజ్మెంట్ నిపుణులు, ఇంజినీర్ల నియామకాలు చేపట్టనున్నట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. కంపెనీ హబ్ ఏర్పాటుతో మన రాష్ట్రంతోపాటు దేశంలో ఫార్మా రంగంలో పని చేస్తున్న వేలాది మంది ప్రతిభావంతులకు ఉద్యోగావకాశాలు లభించనున్నాయి.
దిగ్గజ ఫార్మా కంపెనీలకు కేరాఫ్ హైదరాబాద్: మంత్రి శ్రీధర్బాబు
1961లో ఐడీపీఎల్ స్థాపించినప్పటి నుంచే హైదరాబాద్ దిగ్గజ ఫార్మా కంపెనీలకు చిరునామాగా మారిందని, ప్రస్తుతం 40 శాతం బల్క్ డ్రగ్స్ హైదరాబాద్లోనే ఉత్పత్తి అవుతున్నాయని మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. కొవిడ్ వ్యాక్సిన్లను ఇక్కడే తయారు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఫార్మా కంపెనీలను ప్రోత్సహించే ఫార్మా పాలసీని ప్రభుత్వం అనుసరిస్తుందని చెప్పారు.
జీనోమ్ వ్యాలీలో ఏటీసీ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని, జీనోమ్ వ్యాలీకి కావాల్సిన సాంకేతిక సహకారం అందిస్తామని తెలిపారు. ఎల్ లిల్లీ కంపెనీతో రాష్ట్రంలో ఉన్న ప్రతిభావంతులకు ఉపాధి, ఉద్యోగావకాశాలు మెరుగుపడ్తాయని అన్నారు. ఎల్ లిల్లీ విస్తరణ ఫార్మా రంగానికి కొత్త ఉత్తేజం అందిస్తుందని, ఇప్పటికే లైఫ్ సైన్సెస్ రంగంలో తెలంగాణ వేగవంతమైన వృద్ధి సాధిస్తున్నదని చెప్పారు.