- జీడిమెట్లలో రూ.8.5 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ముగ్గురు అరెస్ట్
- కానిస్టేబుల్తో కలిసి ఐదేండ్లుగా ఇదే పని
జీడిమెట్ల(హైదరాబాద్), వెలుగు: ఈజీ మనీ కోసం డ్రగ్స్ దందాలోకి దిగిన ఓ ముఠాను హైదరాబాద్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. విజయవాడ నుంచి సిటీకి రూ.8.5 కోట్ల విలువైన 140 కిలోల అల్ఫాజోలం తరలిస్తుండగా జీడిమెట్లలో బాలానగర్ ఎస్వోటీ, పేట్ బషీరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురిని అరెస్టు చేశారు. డ్రగ్స్తో పాటు రెండు వెహికల్స్, 50 వేల క్యాష్ సీజ్ చేశారు. మెదక్ జిల్లాకు చెందిన గుడికాడి లింగగౌడ్, అతడి బావమరిది, ఏఆర్ కానిస్టేబుల్ అయిన రామకృష్ణ గౌడ్, ఏపీలోని విజయవాడకు చెందిన డ్రైవర్ మురుదొడ్డి వినోద్ కుమార్ను అరెస్టు చేసినట్లు డీసీపీ పద్మజ తెలిపారు.
ఆర్గానిక్ కెమిస్ట్రీ పీహెచ్డీ చేసి, ఈజీ మనీ కోసం..
మెదక్జిల్లా శంకరంపేట్ మండలం మద్దూర్కు చెందిన గుడికాడి లింగగౌడ్ (36) ఆర్గానిక్ కెమిస్ట్రీలో పీహెచ్డీ చేశాడు. హైదరాబాద్లో డాక్టర్ గౌడ ల్యాబొరెటరీస్ ప్రారంభించాడు. కానీ ఈజీ మనీ కోసం డ్రగ్స్ దందాలోకి దిగాడు. ముడి కెమికల్స్ కొని వాటితో నిషేధిత డ్రగ్స్ తయారు చేసి అమ్మితే కోట్లు సంపాదించవచ్చని అనుకున్నాడు. విజయవాడలో ఉన్న తన స్నేహితుడు కిరణ్ కూడా ల్యాబ్ నడుపుతుండడంతో అతడికీ తన ప్లాన్ చెప్పి, అక్కడి నుంచి కూడా డ్రగ్స్ తయారు చేయించి సిటీకి తెప్పిస్తున్నాడు. ఐదేండ్లుగా ఈ పని చేస్తున్నాడు. ఇన్నాళ్లుగా ఈ పని చేస్తున్నా దొరకకుండా ఉండడానికి లింగగౌడ్ బావమరిది మాదురి రామకృష్ణే కారణం. రామకృష్ణ ఏఆర్ కానిస్టేబుల్ కావడంతో అతడిని డ్రగ్స్ ట్రాన్స్పోర్టేషన్కు వాడుతూ వచ్చాడు. ఈ ముగ్గురు నడిపిస్తున్న అక్రమ దందా గురించి సైబరాబాద్ పోలీస్ కమిషనర్కు పక్కా సమాచారం అందింది. దీంతో బాలానగర్ ఎస్వోటీ పోలీసులు, పేట్బషీరాబాద్ పోలీసులను అలర్ట్ చేశారు. జీడిమెట్ల పైప్లైన్ రోడ్డులో సోమవారం సాయంత్రం బొలెరో ట్రక్ నుంచి ఎర్టిగా కారులోకి డ్రగ్స్ మారుస్తుండగా పట్టుకున్నారు. లింగగౌడ్, రామకృష్ణ గౌడ్, విజయవాడ నుంచి వస్తున్న డ్రైవర్ వినోద్ కుమార్లను అరెస్టు చేశారు. 140 కిలోల డ్రగ్స్, ఆ రెండు వెహికల్స్, రూ.50 వేల నగదు సీజ్ చేశారు. లింగగౌడ్ ఫ్రెండ్ కిరణ్ పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.