
- అప్పట్లో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న మహేశ్ గౌడ్
- ఆయన ఫోన్ను 15 రోజులకు పైగా ట్యాపింగ్ చేసిన ప్రణీత్ టీమ్
- ప్రణీత్రావు ఫోన్ డేటాలో బయటపడ్డ 400 ఫోన్ నంబర్లు
- నేడు సిట్ విచారణకు ప్రభాకర్ రావు, రేపు ప్రణీత్రావు
హైదరాబాద్, వెలుగు:ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసులో సాక్షిగా పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ప్రధాన నిందితుడిగా ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు మంగళవారం సిట్ ముందు హాజరుకానున్నారు.
తన ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి మహేశ్ కుమార్ గౌడ్ సాక్షిగా వాంగ్మూలం ఇచ్చేందుకు వస్తుండగా..రాజకీయ నేతలు టార్గెట్గా గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ఫోన్ ట్యాపింగ్ పై విచారణకు ప్రభాకర్ రావు సిట్ ముందు హాజరుకానున్నారు. ఈ కేసులో రెండో నిందితుడైన ప్రణీత్రావును కూడా బుధవారం ఉదయం సిట్ విచారించనుంది.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు ట్యాపింగ్
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ కాగా, మహేశ్ కుమార్ గౌడ్ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేశారు. వీరిద్దరితో పాటు కాంగ్రెస్, బీజేపీ ముఖ్యనేతలు వారి అనుచరులు, జడ్జీలు, పలు మీడియా సంస్థల సీఈఓలు, జర్నలిస్టుల ఫోన్లను నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ట్యాపింగ్ చేసిన సంగతి తెలిసిందే. మహేశ్ కుమార్ గౌడ్ ఫోన్ను ట్యాప్ చేసినట్టు ఎఫ్ఎస్ఎల్(ఫోరెన్సిక్సైన్స్ల్యాబ్) రిపోర్ట్ బయటపెట్టింది. ఎన్నికలకు ముందు 15 రోజులకు పైగా ట్యాపింగ్ చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు.
ఈ క్రమంలోనే ప్రణీత్రావు వద్ద సేకరించిన ఫోన్ నంబర్లు, ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఆధారంగా సిట్ అధికారులు బాధితులను గుర్తించారు. సాక్షులుగా వారి స్టేట్మెంట్లు రికార్డు చేస్తున్నారు. ప్రణీత్రావు ఫోన్లకు సంబంధించిన ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్లో రంగారెడ్డి జిల్లా, వికారాబాద్, దుబ్బాక, నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లోని సొంతపార్టీలో అనుమానిత నేతలు సహా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ముఖ్య నేతలు వారి అనుచరులకు చెందిన దాదాపు 400లకు పైగా ఫోన్ నంబర్లను సిట్ గుర్తించింది. ఆయా ఫోన్ నంబర్లు ఎవరు వినియోగిస్తున్నారనే వివరాలు సేకరించింది. సాక్షులుగా వారి వాంగ్మూలం రికార్డ్ చేస్తున్నది.
వాంగ్మూలం ఇవ్వనున్న గద్వాల మాజీ జడ్పీ చైర్పర్సన్ సరిత
గద్వాల, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసులో గద్వాల మాజీ జడ్పీ చైర్ పర్సన్ సరిత సాక్షిగా మంగళవారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ ఏసీపీ వద్ద వాంగ్మూలం ఇవ్వనున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో గద్వాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సరిత పోటీ చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గెలుపు కోసం అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం సరిత ఫోన్ ను ట్యాపింగ్ చేసిందని ఆరోపణలున్నాయి.