2018 లో కాంగ్రెస్ ఓటమికి ఫోన్ ట్యాపింగే కారణం.. కేసీఆర్, కేటీఆర్‌ను కఠినంగా శిక్షించాలి: పీసీసీ చీఫ్‌‌ మహేశ్‌‌కుమార్‌‌‌‌ గౌడ్‌‌

2018 లో కాంగ్రెస్ ఓటమికి ఫోన్ ట్యాపింగే కారణం..  కేసీఆర్, కేటీఆర్‌ను కఠినంగా శిక్షించాలి:  పీసీసీ చీఫ్‌‌ మహేశ్‌‌కుమార్‌‌‌‌ గౌడ్‌‌
  • ఫోన్​ ట్యాపింగ్​ కేసులో సాక్షిగా సిట్​కు స్టేట్​మెంట్​
  • రాష్ట్రంలో ఇతర రాజకీయ పార్టీలు లేకుండా ప్లాన్​ చేశారని ఫైర్​
  • ఫోన్​ట్యాపింగ్​ కేసులో సాక్షిగా సిట్​కు వాంగ్మూలం

హైదరాబాద్: రాష్ట్రంలో బీఆర్ఎస్​ తప్ప ఇతర పార్టీలేవీ ఉండకూడదనే రాజకీయ కుట్రలో భాగంగానే నాటి ప్రభుత్వం ఫోన్​ట్యాపింగ్​కు పాల్పడిందని పీసీసీ చీఫ్‌‌ మహేశ్‌‌కుమార్‌‌‌‌ గౌడ్‌‌ అన్నారు. ఇందుకు కారణమైన కేసీఆర్, కేటీఆర్‌‌తోపాటు సంబంధిత పోలీస్​ అధికారులను కఠినంగా శిక్షించాలని కోరారు. 2023 నవంబర్‌‌‌‌ 15 నుంచి 30 మధ్య జరిగిన ఫోన్‌‌ ట్యాపింగ్‌‌ బాధితుల్లో ఒకరైన టీపీసీసీ చీఫ్‌‌ మహేశ్‌‌కుమార్‌‌‌‌ గౌడ్‌‌ సహా మొత్తం 9 మంది సాక్షుల నుంచి సిట్‌‌ మంగళవారం (june 17) స్టేట్‌‌మెంట్‌‌ తీసుకున్నది. 

అనంతరం మహేశ్‌‌గౌడ్‌‌  మీడియాతో మాట్లాడారు. మాజీ సీఎం కేసీఆర్, ​ కేటీఆర్‌‌ ఆదేశాల మేరకే ఫోన్​ ట్యాపింగ్​ జరిగిందని, వారి ఒత్తిళ్లకు లొంగి అప్పటి సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ, హోంశాఖ సెక్రెటరీ, పలువురు పోలీస్ అధికారులు   తమ ఫోన్లను ట్యాప్‌‌ చేశారని మహేశ్​గౌడ్​ తెలిపారు. అప్పటికే పదవీ విరమణ చేసిన ప్రభాకర్ రావును ఐజీ హోదాలో కూర్చోబెట్టి ట్యాపింగ్ చేయించారని అన్నారు. 

మావోయిస్టు సానుభూతిపరులుగా చూపిస్తూ..

బీఆర్‌‌ఎస్​కు వ్యతిరేకంగా పనిచేసిన వారిని మావోయిస్టు ​సానుభూతిపరులుగా చూపిస్తూ చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడ్డారని మహేశ్​ గౌడ్​ ఫైర్​ అయ్యారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి ఫోన్ ట్యాపింగ్ ముఖ్య కారణమని అనుమానం వ్యక్తం చేశారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌‌ ఓడిపోయిన ప్రతి నియోజకవర్గంలో తమ ఫోన్లను ట్యాప్ చేశారని ఆరోపించారు. 

కాంగ్రెస్ నాయకులే కాకుండా మొత్తం 650 మందికి పైగా ఫోన్లు ట్యాప్ చేసినట్లు తెలిసిందన్నారు. 2023 ఎన్నికల సమయంలో అప్పటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తో కలిసి వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో సీఎస్‌‌కు ఫిర్యాదు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. కాంగ్రెస్‌‌ అధికారంలోకి రాగానే  బీఆర్ఎస్ నేతలు హార్డ్ డిస్క్​లను ధ్వంసం చేశారని 
మహేశ్​గౌడ్​ చెప్పారు.