ఒడిశా రైలు ప్రమాదంపై సుప్రీంకోర్టులో పిల్

ఒడిశా రైలు ప్రమాదంపై సుప్రీంకోర్టులో పిల్

బాలాసోర్ రైలు ప్రమాదంపై సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలోని నిపుణుల బృందంతో విచారణ జరిపించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. సుప్రీంకోర్టు న్యాయవాది విశాల్ తివారీ ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా ఉండేందుకు కవాచ్‌ను అమలు చేయాలని కూడా విజ్ఞప్తి చేశారు. రైలు భద్రతను నిర్ధారించేందుకు మార్గదర్శకాలను రూపొందించాలని, రెండు నెలల్లో కమిషన్ తన నివేదికను కోర్టుకు సమర్పించాలని పేర్కొన్నారు.  

పశ్చిమబెంగాల్ షాలిమార్ నుంచి చెన్నై వెళుతున్న కోరమండల్ ఎక్స్ ప్రెస్ 2023, జూన్ 2వ తేదీ మధ్యాహ్నం 3 గంటల 20 నిమిషాలకు షాలిమార్ స్టేషన్ లో బయలుదేరి.. ఆరున్నర గంటలకు బాలాసోర్ చేరుకుంది. అక్కడి నుంచి బయలుదేరిన ఈ  రైలు.. బాలేశ్వర్ దగ్గరకు రాగానే.. పట్టాలు తప్పి  పక్క ట్రాక్ పై.. ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో  కోరమండల్ కు చెందిన 12 బోగీలు చెల్లాచెదురుగా పక్కనే ఉన్న మూడో రైల్వే లైన్ (ట్రాక్)పై కొన్ని బోగీలు పడ్డాయి. 

ఈ ప్రమాదం 6 గంటల 50 నిమిషాలకు జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు అధికారులు. ఆ తర్వాత 15 నిమిషాలకు అంటే.. 7 గంటల 15 నిమిషాల సమయంలో.. బెంగళూరు నుంచి హౌరా వెళుతున్న యశ్వంత్ పూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలు.. పట్టాలపై పడిపోయిన కోరమండల్ ఎక్స్ ప్రెస్ బోగీలను ఢీ కొట్టాయి.