నల్గొండలో బీఆర్ఎస్ లీడర్ల గలీజు దందా

నల్గొండలో బీఆర్ఎస్ లీడర్ల గలీజు దందా
  •     నిరుపయోగంగా మారిన ఐటీ టవర్స్, 
  •     రూ. 50 కోట్లు ఖరీదైన ఆగ్రోస్ స్థలం రూ. 5 లక్షలకే అప్పగింత
  •     ఎంక్వైరీ చేస్తున్న కాంగ్రెస్​ సర్కార్
  •     ఆఫీసర్లలో టెన్షన్

నల్గొండ, వెలుగు : నల్గొండ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ భూములు కాజేసేందుకు బీఆర్ఎస్ లీడర్లు చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని వందల కోట్ల విలువైన భూములను లీజు పేరిట కారుచౌకగా కాజేసేందుకు స్కెచ్ వేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు నుంచే అక్రమాలకు బాటలుపడ్డాయి. పాలిటెక్నిక్ కాలేజీ భూములు, సెంట్రల్ వేర్ హౌజింగ్ గోడౌన్ లు, ఆర్టీసీ బస్టాండ్, ఆగ్రో ల్యాండ్స్, ఆర్ అండ్ బీ డిపార్ట్ మెంట్ కు చెందిన వందల కోట్ల ఖరీదైన భూములను లీజు పేరిట తమ గుప్పిట్లో పెట్టుకునేందుకు ప్లాన్ చేశారు. 

ఆగమేఘాలపై ఐటీ టవర్స్, బీఆర్ ఎస్ ఆఫీస్ నిర్మాణం

పాలిటెక్నిక్ కాలేజీ భూముల్లో ఐటీ టవర్స్, ఆగ్రో ల్యాండ్​లో బీఆర్ ఎస్ జిల్లా ఆఫీస్ నిర్మాణం ఆగమేఘాల మీద జరిగిపోయాయి. ఇక సెంట్రల్​వేర్ హౌజింగ్​ కార్పొరేషన్ ల్యాండ్స్ ను స్వాధీనం చేసుకున్న సర్కార్ అక్కడ కమర్షియల్​కాంప్లెక్స్​ నిర్మించేందుకు టెండర్లు పిలిచింది. ఆర్టీసీ బస్టాండ్ స్థలాన్ని కాజేసేందుకు ఉమ్మడి వరంగల్​ జిల్లాకు చెందిన ఇంజినీరింగ్​ కాలేజీల అధిపతి, నల్గొండ జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్సీతో కలిసి ప్లాన్ వేశారు. కానీ ఈలోగా అసెంబ్లీ ఎన్నికల రావడంతో ఆర్టీసీ బస్టాండ్​ప్లాన్ ఆగిపోయింది. ఆర్​అండ్​బీ బిల్డింగ్స్​కూల్చేసి నిర్మించాలనుకున్న కళాభారతి కూడా బ్రేక్​పడింది. ఇవి రెండు మినహా మిగతా వాటిని దక్కించుకునే ప్లాన్ లో సక్సెస్ అయ్యారు. కానీ ఎన్నికల్లో బీఆర్ ఎస్ ఓడిపోవడంతో వారి లీజు దందాకు అడ్డుకట్ట పడింది. కొత్తగా వచ్చిన కాంగ్రెస్​సర్కార్​రాష్ట్రవ్యాప్తంగా బీఆర్​ఎస్​నేతలు కాజేసిన ప్రభుత్వ భూములపై ఎంక్వైరీ చేయడం మొదలు పెట్టింది. ఈ నేపథ్యంలో నల్గొండలో జరిగిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

పడావు పడ్డ ఐటీ టవర్స్

పాలిటెక్నిక్​కాలేజీ స్థలంలో రూ.90 కోట్లతో నిర్మించిన ఐటీ టవర్స్​ప్రస్తుతం పడావు పడ్డాయి. ఎన్నికల్లో రాజకీయంగా లబ్ధి పొందాలన్న ఆలోచనతో కేవలం ఏడాదిన్నరలోనే మొత్తం ప్రాజెక్టెను కంప్లీట్​చేశారు. రెండు వేల మందికి తక్షణమే ఉపాధి కల్పించేందుకు 11 కంపెనీలు అగ్రిమెంట్​చేసుకున్నాయని అప్పటి ఐటీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ప్రకటించారు. ఐటీ టవర్స్​శంకుస్థాపనకు వచ్చిన కేటీఆర్ పొరుగు దేశాల్లో ఉన్న ఐటీ కంపెనీల ఓనర్లతో ఆన్​లైన్​ద్వారా బహిరంగ సభలోనే ఒప్పంద వివరాలు వెల్లడించారు. ఐటీ పార్క్ నిర్మాణాన్ని సైతం సీక్రెట్ టెండర్ల ద్వారా తమ బినామీలకే కట్టబెట్టారు. నిర్మాణం పూర్తయ్యాక లీజ్ అగ్రిమెంట్ ను తెరపైకి తెచ్చారు.

మొత్తం మూడంతస్తుల ఐటీ టవర్స్​ను నెలకు రూ. 2 లక్షల చొప్పున 99 ఏళ్ల పాటు లీజుకు ఇస్తున్నట్లు మరో బినామీ సంస్థతో అగ్రిమెంట్ చేసుకున్నట్లు తెలిసింది. వరంగల్​జిల్లాకు చెందిన ఈ సంస్థ నిర్వాహకాన్ని చూసి ఐటీ కంపెనీలు బెంబేలెత్తిపోయాయి. బిల్డింగ్​లో కొంత భాగాన్ని మాత్రమే ఐటీ కంపెనీలకు ఇస్తామని, అది కూడా స్క్వేర్ ఫీటుకు రూ.1,200 చెల్లించాలని కండీషన్ పెట్టినట్లు సమాచారం. దీంతో హైదరాబాద్ లోనే అంత రేటు లేదని, నల్గొండలో అంత రేటు చెల్లించడం అసాధ్యమని ఐటీ కంపెనీలు వెనక్కి వెళ్లిపోయాయి. దీంతో ఈ బిల్డింగ్ లో ప్రస్తుతం ఒకటి, రెండు కంపెనీలు మాత్రమే నడుస్తుండగా, ఉద్యోగులు 20, 30కి మించి లేరని తెలిసింది. టవర్స్​లో అన్ని ఫ్లోర్లు ఖాళీగా ఉండడంతో దుమ్ము, ధూళి పేరుకుపోయింది. బయటి వ్యక్తులను, మీడియాను ఎవరినీ లోపలికి రానివ్వడం లేదు. 

కమర్షియల్ కాంప్లెక్స్ పేరుతో గోడౌన్ కూల్చివేత

నల్గొండలో అగ్రికల్చర్ మార్కెట్​ఆఫీస్ సమీపంలోని సుమారు 2 వేల గజాల స్థలంలో ఉన్న గోడౌన్ లను ఎన్నికల ముందు కూల్చేశారు. స్టేట్​వేర్​హౌజింగ్​కార్పొరేషన్ పర్మిషన్​తీసుకుని కమర్షియల్​బిల్డింగ్ కట్టేందుకు ప్లాన్ చేశారు. అంత కంటే ముందు ఈ స్థలాన్ని ఓ ప్రముఖ జ్యూవెల్లరీ సంస్థకు లీజ్ కు ఇచ్చేందుకు ప్రయత్నించినా బేరం కుదరలేదు. తర్వాత బీఆర్​ఎస్​కు చెందిన మాజీ నేతలు సర్కార్​పెద్దలను ఒప్పించి వరంగల్ జిల్లాకు చెందిన ఓ బినామీ సంస్థకు కాంట్రాక్ట్ అప్పగించారు. ఈ స్థలంలో కమర్షియల్​కాంప్లెక్స్ నిర్మించేందుకు రూ.10 కోట్లతో టెండర్లు పిలిచారు.

నిర్మాణం జరిగాక 99 ఏళ్ల పాటు నెలకు కేవలం రూ.50 వేలు లీజు చెల్లించేలా ఓ బీఆర్​ఎస్​మాజీ నేత వేర్​హౌజింగ్​కార్పొరేషన్ తో అగ్రిమెంట్ చేసుకున్నట్టు తెలిసింది. నిజానికి ఈ కమర్షియల్​కాంప్లెక్స్​ద్వారా వచ్చే ఆదాయాన్ని గోడౌన్లలో పనిచేసే కార్మికులు, ఉద్యోగుల జీతాలు, గోడౌన్ల అభివృద్ధికి ఉపయోగించాల్సి ఉంది. కానీ దానిని పక్కన పెట్టి నెలకు కేవలం రూ.50 వేల లీజు మాత్రమే ప్రభుత్వానికి చెల్లించి, మిగతా ఆదాయాన్ని తమ జేబుల్లో వేసేందుకు ప్లాన్ చేశారు. ఆర్టీసీ ప్లేస్ లలో షాపింగ్​కాంప్లెక్స్​లు నిర్మించి వ్యాపారులకు అద్దెకు ఇవ్వడం ద్వారా వచ్చే ఆదాయం కార్పొరేషన్ కే వెళ్తుంది. కానీ ఇక్కడ మాత్రం మార్కెట్​రేటు ప్రకారం రూ.40 కోట్లు ఖరీదు చేసే వేర్​హౌజింగ్​స్థలంలో కమర్షియల్​కాంప్లెక్స్ కట్టి ప్రభుత్వానికి నామమాత్రపు రెంట్ చెల్లించేలా ప్లాన్ చేయడం గమనార్హం. 

రూ.50 కోట్లు ఖరీదు చేసే ఆగ్రోస్​ స్థలం మాయం

హైదరాబాద్ మెయిన్​రోడ్డులో సుమారు రూ.50 కోట్లు ఖరీదైన ఆగ్రోస్​ఇండస్ట్రీస్ స్థలాన్ని బీఆర్​ఎస్​కేవలం రూ.5 లక్షలకే సొంతం చేసుకుంది. ఆగ్రోస్​ స్థలంలో పార్టీ ఆఫీస్ కట్టుకునేందుకు ప్రభుత్వం పర్మిషన్​ఇచ్చింది. సుమారు రెండు ఎకరాల స్థలంలో ఒక ఎకరం పార్టీ ఆఫీస్ కు ఇవ్వగా, మిగిలిన దాంట్లో ఆగ్రోస్ సంస్థ పెట్రోల్ బంక్, కమర్షియల్​అవసరాల కోసం లీజుకు ఇచ్చింది. ఎకరం స్థలంలో నిర్మించిన పార్టీ ఆఫీసులోకి వెళ్లేందుకు దారిలేదన్న సాకుతో ప్రైవేట్ వ్యక్తుల స్థలాన్ని కాజేయాలని బీఆర్​ఎస్​నేతలు ప్లాన్ చేశారు. దాని పక్కనే ఉన్న మరో ప్రైవేట్ కాలేజీ స్థలాన్ని సైతం ఆక్రమించినట్టు తెలిసింది. ప్రస్తుతం ఈ స్థలం గురించి వివాదం నడుస్తోంది. మున్సిపల్​పర్మిషన్​లేకుండా కట్టిన పార్టీ ఆఫీస్ కు నోటీసులు జారీ చేసి, ఆ ప్లేస్​లో పెద్ద ఎత్తున డిజిటల్​లైబ్రరీ కట్టాలన్న ఆలచనలో కాంగ్రెస్​ ఉన్నట్లు తెలిసింది.

ముందు లీజు.. తర్వాత రెగ్యులరైజేషన్ 

లీజు అనే పదానికి బీఆర్ ఎస్ సర్కార్ అర్థమే మార్చివేసింది. 99 ఏళ్ల పాటు లీజుకు తీసుకున్న స్థలాన్ని క్రమబద్ధీకరించే ప్రక్రియను బీఆర్​ఎస్ సర్కార్ మొదలుపెట్టింది. నల్గొండలో రూ.500 కోట్ల ఖరీదైన ప్రకాశం బజార్​ మడిగలను వ్యాపారుల సొంతం చేసింది. అక్కడ స్థలం మున్సిపాలిటీది గాక, షాపులు వ్యాపారులు కట్టుకున్నారు. దీని పై మున్సిపాలిటీకి లీజు చెల్లిస్తున్నారు. అయితే బీఆర్​ఎస్ ప్రభుత్వం వచ్చాక ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు స్థలంతో సహా, షాపులను వ్యాపారుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు. ఈ సంఘటనతోనే నల్గొండలో ప్రభుత్వ స్థలాల పైన బీఆర్​ఎస్​నేతల కన్ను పడింది. ముందుగా ప్రభుత్వంతో టెండర్లు పిలిచేలా చేయడం, వాటిని కట్టించాక 99 ఏళ్ల పాటు లీజు పేరుతో మరో ఒప్పందాన్ని తెరపైకి తెస్తున్నారు. ఆ తర్వాత కొన్నేళ్లకు క్రమబద్దీకరణ పేరుతో సొంతం చేసుకోవడం జరుగుతోంది.

సర్కార్​ మారడంతో ఆఫీసర్లలో టెన్షన్

లీజు దందాపై కాంగ్రెస్​సర్కార్​ ఏం నిర్ణయం తీసుకుంటుందోనని ఆఫీసర్లు వెయిట్​చేస్తున్నారు. గతంలో బీఆర్​ఎస్ సర్కార్​ఒత్తిడి మేరకు అన్ని రకాల పర్మిషన్లు, ఒప్పందాలపైన ఆఫీసర్లు సంతకాలు పెట్టారు. ఇప్పుడు ఆ అక్రమాలన్నింటినీ కాంగ్రెస్​సర్కార్​తిరగతోడుతోంది. పాత అగ్రిమెంట్లు, కాంట్రాక్టులను రద్దు చేసి మళ్లీ టెండర్లు పిలుస్తారా ? లేదంటే లీజు పాలసీలో ఏమైనా మార్పులు తీసుకొస్తారా ? అనే దాని పై చర్చ జరుగుతోంది. ఈ లీజ్ దందాలపై సర్కార్ ఎంక్వైరీ మొదలుపెట్టడంతో ఆఫీసర్లలో టెన్షన్ మొదలైంది.