రైతులకు గుడ్​ న్యూస్​: పీఎం కిసాన్​ డబ్బులు మళ్లీ ఎప్పుడంటే..!

రైతులకు గుడ్​ న్యూస్​:  పీఎం కిసాన్​ డబ్బులు మళ్లీ ఎప్పుడంటే..!

కేంద్రప్రభుత్వం  రైతులకు గుడ్​ న్యూస్​ చెప్పింది. రైతులకు పెట్టుబడి కింద ఆర్థికసాయం అందించేందుకు ఏర్పాటు చేసిన  పీఎం కిసాన్ యోజన పథకం కింద 20వ విడత నిధులను విడుదలకు సన్నాహాలు చేస్తుంది.వచ్చే నెలలో అంటే జూన్​ 2025 లో రైతులకు వారి ఖాతాలో  2 వేల రూపాయిలు కేంద్ర ప్రభుత్వం  జమచేయనుంది. చిన్న, సన్నకారు రైతులకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు మోదీ ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తుంది.   ప్రభుత్వం ఇంకా కచ్చితమైన తేదీని ప్రకటించకపోయినప్పటికీ జూన్‌ మొదటి వారంలో ఈ మొత్తం జమ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

గతంలో 2025 ఫిబ్రవరి 24న  ప్రధాన మంత్రి మోదీ  బీహార్‌ లోని భాగల్‌ పూర్‌ లో జరిగిన ఒక కార్యక్రమంలో పీఎం కిసాన్​ నిథులను  విడుదల చేశారు. జూన్​ నెలలో విడుదలయ్యే పీఎం కిసాన్​ నిథులు బ్యాంక్​ ఖాతాలో జమ కావాలంటే  రైతులు తప్పనిసరిగా తమ ఈ కేవైసీ (E-KYC)ని పూర్తి చేయాలి. పీఎం కిసాన్‌ అధికారిక వెబ్‌ సైట్లో కూడా ఈ రూల్‌ పాటించాలని స్పష్టంగా చెప్పారు. ఈ కేవైసీ పూర్తి చేయకుంటే రూ. 2,000 మొత్తం రైతుల అకౌంట్లో జమ కాదు. అంతేకాదు రైతులు తమ భూమి రికార్డులు కూడా పరిశీలించుకోవాలి.  ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ధరణి పోర్టల్​ ను రద్దు చేసి కొత్తగా భూ భారతి పోర్టల్​ను ప్రవేశ పెట్టింది.  మీ భూములకు సంబంధించి వివరాలను https://bhubharati.telangana.gov.in వెబ్​సైట్​ ద్వారా తెలుసుకోవచ్చు. బ్యాంకు అకౌంట్స్‌ ఆధార్‌ కార్డులతో లింక్‌ అయి ఉండాలి. ఈ వివరాలు సరిగా లేకపోతే  రావాల్సిన డబ్బులు అకౌంట్లో ఆగిపోతాయి.

ఈ కేవైసీ ఎలా..

 రైతులు  ఇళ్ల నుంచే ఓటీపీ ఆధారిత పద్ధతిలో సులభంగా ఈ కేవైసీని పూర్తి చేయవచ్చు. https://pmkisan.gov.in హోంపేజీలో కనిపించే e-KYC ఆప్షన్‌ పై క్లిక్‌ చేయాలి. తర్వాత ఆధార్‌ కార్డ్‌ నెంబర్‌, అక్కడ కనిపించే సెక్యూరిటీ కోడ్‌ ఎంటర్‌ చేయాలి. Search పై క్లిక్‌ చేసి ఆ తర్వాత ఆధార్‌ తో లింక్‌ అయిన మొబైల్‌ నెంబర్‌ ఎంటర్‌ చేయాలి. మొబైల్‌ కు OTP వస్తుంది. దాన్ని అక్కడ ఎంటర్‌ చేస్తే ఇ కేవైసీ ప్రక్రియ పూర్తవుతుంది.