దక్షిణాఫ్రికా పర్యటనకు బయల్దేరిన ప్రధాని మోదీ

 దక్షిణాఫ్రికా పర్యటనకు బయల్దేరిన ప్రధాని మోదీ

జోహన్నెస్‌బర్గ్‌లో 2023 ఆగస్టు 22 నుంచి -24 వరకు  జరగనున్న 15వ బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 22న మంగళవారం దక్షిణాఫ్రికా వెళ్లారు. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా ఆహ్వానం మేరకు ప్రధాని దక్షిణాఫ్రికాకు వెళ్లారు.  చివరిసారిగా ఈ సమావేశాలు 2019లో జరగగా కోవిడ్-19 కారణంగా ఈ సమావేశాలు వర్చువల్‌గా జరుగుతూ వచ్చాయి. 

ఈ సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోదీ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ఏమైనా ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. కానీ వీరి భేటీపై భారత విదేశాంగ శాఖ ఎలాంటి స్పష్టతను ఇవ్వలేదు.  చివరిసారిగా మోదీ,  జిన్‌పింగ్‌ గతేడాది నవంబర్‌లో బాలి వేదికగా జరిగిన జీ20 సదస్సులో ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో ఇచ్చిన విందులో కలిసి పాల్గొన్నారు కానీ ఏమీ చర్చించలేదు. 

దక్షిణాఫ్రికాలో ప్రధాని మోదీ మధ్యాహ్నం 3.55గంటలకు శాండ్టన్ కన్వెన్షన్ సెంటర్‌కు చేరుకుంటారు. సాయంత్రం 4 గంటలకు బ్రిక్స్ బిజినెస్ ఫోరమ్ నాయకులతో సంభాషిస్తారు. సాయంత్రం 6 గంటలకు లీడర్స్ రిట్రీట్ కోసం సమ్మర్ ప్లేస్‌కు చేరుకుంటారు. ఈ కార్యక్రమం తర్వాత దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా విందు ఇవ్వనున్నారు.