మీరే నా కుటుంబం: జవాన్లతో ప్రధాని మోడీ

మీరే నా కుటుంబం: జవాన్లతో ప్రధాని మోడీ

ఆర్మీ జవాన్లే తన కుటుంబమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. దీపావళి పండుగ నాడు వారితో కలిసి గడపడం చాలా సంతోషంగా ఉందన్నారాయన. కశ్మీర్లో రాజౌరీ సెక్టార్ లోని సరిహద్దు వద్ద జవాన్లతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. జవాన్లకు స్వీట్లు తినిపించి, దివ్వెల పండుగ చేసుకున్నారాయన. ఆ తర్వాత ఆయన సైనికులను ఉద్దేశించి మాట్లాడారు.

కుటుంబంతో దీపావళి

‘కుటుంబసభ్యులతో కలిసి దీపావళి జరుపుకోవడం మన సంప్రదాయం. నేను కూడా నా కుటుంబంతో కలిసి పండుగ చేసుకోవాలని నిర్ణయించుకున్నా. అందుకే నేను ఇక్కడికి వచ్చాను. మీరే నా కుటుంబం’ అని చెప్పారు ప్రధాని మోడీ.

ఓటమి ఎరుగని ప్రాంతమిది

సరిహద్దులో చాలా ప్రాంతాలు ఉన్నా రాజౌరీ సెక్టార్ చాలా ప్రత్యేకమని ప్రధాని మోడీ అన్నారు. యుద్ధాలను, చొరబాటులను చూసిన ప్రాంతమని, ఎప్పుడూ ఓటమినే ఎరుగని ప్రాంతమని చెప్పారాయన. ఈ ప్రాంతం నుంచి ఎవరూ చొరబడే సాహసం చేయలేరని, విజయాలకు పెట్టింది పేరని రాజౌరీలో పహారా కాస్తున్న సైనికులను మెచ్చుకున్నారు.