వ్యవసాయ బిల్లులు చారిత్రాత్మకం.. ప్రతిపక్షాల వలలో పడకండి!

వ్యవసాయ బిల్లులు చారిత్రాత్మకం.. ప్రతిపక్షాల వలలో పడకండి!

న్యూఢిల్లీ: వ్యవసాయ రంగానికి సంబంధించి కేంద్రం తీసుకొచ్చిన మూడు కొత్త బిల్లులపై తీవ్ర చర్చ నడుస్తోంది. ఈ బిల్లులకు నిరసనగా కేంద్ర మంత్రి, అకాళీదల్ నేత హర్‌‌సిమ్రన్ కౌర్ గురువారం రాజీనామా చేశారు. తాజాగా ఈ విషయంపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. ఈ బిల్లులపై ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన పార్టీలు.. ఇప్పుడు వీటిని మేం అమలు చేయడంతో వ్యతిరేకిస్తున్నాయని మోడీ మండిపడ్డారు. ప్రతిపక్షాలు రైతులకు కాకుండా మధ్యవర్తులకు సాయం చేయాలనుకుంటున్నాయని, ఫార్మర్స్ వారి అబద్ధాల వలలో పడొద్దన్నారు.

‘దశాబ్దాలుగా దేశాన్ని పాలించిన వారితో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. వాళ్లు తమ మోసపూరిత మాటలతో రైతులను వలలో వేసుకోవాలని చూస్తున్నారు. రైతుల సంకెళ్లను తీసివేసే దిశగా ఇదో చారిత్రాత్మక అడుగు. రైతులు తమ ఉత్పత్తులను ఎక్కడైనా అమ్ముకునేలా స్వేచ్ఛ కల్పించాలి. ప్రస్తుతం దేశానికి కావాల్సింది కూడా ఇదే. ప్రజలకు ఇచ్చిన హామీని ఎన్డీయే నిలబెట్టుకుంటుంది. అయితే రైతుల నుంచి ధాన్యం, బియ్యంతోపాటు మరికొన్ని వ్యవసాయ ఉత్పత్తులను ఎంఎస్‌పీ రూల్ కింద ప్రభుత్వం కొనుగోలు చేయబోదని కొందరు రూమర్లు వ్యాప్తి చేస్తున్నారు. కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులు రైతులకు రక్షణ కవచాలు. వ్యవసాయంలో రైతులకు కొత్త స్వాతంత్ర్యం లభించినట్లే’ అని మోడీ చెప్పారు.