29 నుంచి ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటన

29 నుంచి ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటన
  • జీ-20 సదస్సులో 8వ సారి పాల్గొననున్న మోడీ

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటనకు వెళుతున్నారు. విదేశీ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ ఇటలీ, బ్రిటన్ తదితర దేశాల అధినేతలతో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈనెల 29న ఇటలీకి బయలుదేరి వెళతారు. మొత్తం 5 రోజులపాటు విదేశాల్లో పర్యటించనున్న మోడీ  మొదట రోమ్ కు వెళతారు. ఈనెల 30, 31వ తేదీల్లో రోమ్ లో ఇటలీ ప్రధాని అధ్యక్షతన జరగనున్న జీ-20 దేశాల సదస్సులో ప్రధాని మోడీ పాల్గొంటారు. ఈ సదస్సులో కరోనా మహమ్మారి విలయం, ఆరోగ్యం విషయాల్లో అంతర్జాతీయ సహకారం, ఆర్ధిక వ్యవస్థను పునరుద్ధరించడం, ఆహార భద్రత, సుస్థిర అభివృద్ధి, వాతావరణ మార్పు తదితర అంశాలే అజెండాగా ఉన్నాయి. జీ-20 సభ్య దేశాల అధ్యక్షులు, ప్రభుత్వ అధినేతలు పాల్గొనే ఈ సదస్సులో ప్రధాని మోడీ పాల్గొనడం 8వ సారి కావడంతో ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. 2023లో ఈ సదస్సుకు భారత్ వేదిక కాబోతోంది. 
రోమ్ లో జరిగే జీ20 సదస్సు ముగిసిన అనంతరం ప్రధాని మోడీ అక్కడ నుంచి స్కాట్లాండ్ లోని గ్లాస్కోకు బయలుదేరుతారు. అక్కడ ఈనెల 31 నుంచి నవంబర్ 12 వరకు జరగనున్న  కాప్ -26 సదస్సుకు ప్రధాని మోడీ హాజరవుతారు. నవంబర్ 1, 2వ తేదీల్లో జరిగే వరల్డ్ లీడర్స్ సమ్మిట్ (WSL)పేరుతో జరిగే ఈ సమావేశంలో పాల్గొంటారు. ప్రపంచ వ్యాప్తంగా 120 దేశాల అధినేతలు హాజరవుతున్న ఈ సదస్సుకు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అధ్యక్షత వహిస్తారు. గత ఏడాది జరగాల్సిన కాప్-26 సదస్సు కరోనా కారణంగా వాయిదాలు పడి తాజాగా ఇప్పుడు జరగనుంది.