రోజ్‌గార్ మేళా..71 వేల మందికి జాబ్ లెటర్ల పంపిణీ

 రోజ్‌గార్ మేళా..71 వేల మందికి జాబ్ లెటర్ల పంపిణీ

న్యూఢిల్లీ:వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలకు ఎంపికైన దాదాపు 71వేల మందికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అపాయింట్‌మెంట్ లెటర్‌లను పంపిణీ చేయనున్నారు . అనంతరం వారిని ఉద్దేశించి  మాట్లాడతారు. ఈ రోజ్‌గార్ మేళాను దేశవ్యాప్తంగా 45 ప్రదేశాల్లో నిర్వహించనున్నట్లు కేంద్రం ఒక ప్రకటనలో వెల్లడించింది.

కేంద్ర ప్రభుత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఈ మేళాలో పాల్గొంటాయి. అపాయింట్‌మెంట్ లెటర్‌ పొందినవారు గ్రామీణ డాక్ సేవకులు, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోస్ట్‌లు, కమర్షియల్-కమ్- టికెట్ క్లర్క్, జూనియర్ క్లర్క్-కమ్ -టైపిస్ట్, జూనియర్ అకౌంట్స్ క్లర్క్, ట్రాక్ మెయింటెయినర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, లోయర్ డివిజన్ వంటి వివిధ పోస్టుల్లో చేరనున్నారు.

ఉద్యోగాల సృష్టికి ప్రధాని మోడీ  అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారని కేంద్రం తెలిపింది. దీనిలో భాగంగానే రోజ్‌గార్ మేళాను నిర్వహిస్తున్నట్లు చెప్పింది. రాబోయే రోజుల్లో మరిన్ని ఉపాధి అవకాశాలను సృష్టించడానికి ఇది దోహదపడుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొంది. ఇప్పటివరకు, మోడీ 2.9 లక్షల మందికి అపాయింట్‌మెంట్ లెటర్‌లను పంపిణీ చేశారని.. తాజా కార్యక్రమంతో ఆ సంఖ్య 3.6 లక్షలకు చేరుకుంటుందని వివరించింది.