- కరీంనగర్లో భగీరథ్ మేనమామకు నోటీసులు అందించిన పేట్ బషీరాబాద్ పోలీసులు
- ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు తమముందు హాజరుకావాలని ఆదేశాలు
- కొత్తగా చేర్చిన సెక్షన్ల ప్రకారం 20 ఏండ్ల జైలు లేదా జీవిత ఖైదు
హైదరాబాద్, వెలుగు: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్పై ఈ నెల 8న నమోదైన పోక్సో కేసు కీలక మలుపు తిరిగింది. బాధితురాలి స్టేట్మెంట్ ఆధారంగా రేప్ కేసుకు సంబంధించి పోక్సో యాక్ట్లోని 5(1) రెడ్విత్ 6 సెక్షన్లనూ ఎఫ్ఐఆర్లో చేర్చారు. ఈ నెల 8న బాధిరాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా బీఎన్ఎస్ 74,75తో పాటు మైనర్పై లైంగిక వేధింపులకు సంబంధించి పోక్సో చట్టంలోని 11 రెడ్ విత్ 12 సెక్షన్ల కింద పేట్ బషీరాబాద్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న ఈ కేసు తీవ్రత నేపథ్యంలో కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ మంగళవారం మరోసారి బాధితురాలి వద్దకు వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. తల్లి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న అంశాలతోపాటు బాధితురాలు తెలిపిన వివరాల ఆధారంగా సమాచారం సేకరించారు.
భగీరథ్ను తీసుకురావాలని మేనమామకు నోటీసులు
దర్యాప్తులో భాగంగా బాధితురాలితో పోలీసులు మాట్లా డారు.ఈ క్రమంలోనే బాధితురాలిపై లైంగిక దాడి కూడా జరిగినట్టు ప్రాథమికంగా గుర్తించారు. ఈ మేరకు మైనర్పై లైంగిక దాడికి సంబంధించి 5(1) రెడ్విత్ 6 పోక్సో సెక్షన్లను ఎఫ్ఐఆర్లో చేర్చారు. నిందితుడు భగీరథ్కు నోటీసులు జారీ చేసేందుకు పేట్బషీరాబాద్ పోలీసులు కరీంనగర్ వెళ్లారు. కాల్ డేటా ఆధారంగా భగీరథ్ మామ ఇంటికి వెళ్లారు. భగీరథ్ అందుబాటులో లేకపోవడంతో.. ఆయన మేనమామ వంశీకృష్ణకు నోటీసులు అందించారు. దర్యాప్తులో భాగంగా నిందితుడు భగీరథ్తో కలిసి బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు తమ ముందు హాజరుకావాలని ఆదేశించారు. హాజరుకాని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నేరం రుజువైతే 20 ఏండ్లు శిక్ష, లేదా జీవిత ఖైదు
గతంలో నమోదు చేసిన బీఎన్ఎస్ 74, 75, పోక్సో చట్టంలోని సెక్షన్ 11,12 ప్రకారం.. నేరం రుజువైతే కోర్టులు మూడేండ్ల జైలు శిక్ష, జరిమానా విధిస్తాయి. బెయిల్ కూడా లభించే అవకాశాలున్నాయి. కాగా, ప్రస్తుతం చేర్చిన 5(1), 6 పోక్సో సెక్షన్ల ప్రకారం.. బెయిల్ లభించకపోగా నేరం రుజువైతే 20 ఏండ్ల వరకు జైలు శిక్ష, తీవ్రతను బట్టి జీవిత ఖైదు విధించే అవకాశాలున్నాయి. దీంతో నిందితుడు బండి భగీరథ్ను అరెస్ట్ అనివార్యంగా మారింది. భగీరథ్తోపాటు మరికొంత మందిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు పోలీసులు రంగం సిద్ధం చేసినట్టు తెలిసింది.
ముందస్తు బెయిలివ్వండి: హైకోర్టులో భగీరథ్ పిటిషన్
తనపై నమోదైన పోక్సో కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్ హైకోర్టులో మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 8న పేట్బషీరాబాద్లో తనపై తప్పుడు ఆరోపణలతో పోక్సో కేసు పెట్టారని, బాధితురాలి వయసు 19 నుంచి 20 మధ్య ఉంటుందన్నారు. తప్పుడు రికార్డులతో ఆమె వయస్సును తక్కువగా చూపారని భగీరథ్పిటిషన్లో పేర్కొన్నారు.
ఒకవైపు లైంగిక వేధింపులకు గురిచేశానంటూ, మరోవైపు సంబంధం కొనసాగిం చానంటూ పరస్పర విరుద్ధమైన ఆరోపణలతో కేసు నమోదు చేశారన్నారు. 8 నెలల క్రితం జరిగిన సంఘట నపై ఆలస్యంగా ఫిర్యాదు చేశారని, దీనికి ఎలాంటి కారణాలు వెల్లడించలేదన్నారు. ఒకవేళ 8 నెలల క్రితం లైంగిక వేధింపులకు గురిచేసి ఉంటే ఆ తరువాత కూడా బాధితురాలి కుటుంబం తనతో ఎందుకు సన్నిహి తంగా ఉందని ప్రశ్నించారు. కుమార్తెతో సన్నిహితంగా ఉండడాన్ని గమనించిన ఫిర్యాదుదారు 5 కోట్లు ఇవ్వాలని బ్లాక్మెయిల్ చేశారని, దీనిపై కరీంనగర్ పోలీసు స్టేషన్లో కేసు పెట్టిన విషయం తెలిసి తనపై హైదరాబాద్లో కేసు పెట్టారన్నారు.
తనపై నమోదైన కేసులోని అభియోగాలన్నింటికీ ఏడేండ్లలోపు శిక్ష మాత్రమే ఉందని, ఇలాంటి కేసుల్లో నోటీసు ఇచ్చి విచారించవచ్చన్నారు. అంతేకాకుండా ఎఫ్ఐఆర్లో సెక్ష న్లను సవరించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తనకు ప్రస్తుతం బాధితురాలి కుటుంబంతో ఎలాంటి సంబంధాలు లేనందున వారిని బెదిరించడం అన్న ప్రశ్న ఉత్పన్నం కాదన్నారు. తప్పుడు ఆరోపణల తో నమోదైన కేసులో తనను అరెస్ట్ చేస్తే తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. తాను దర్యాప్తు అధికారికి, కోర్టు విచారణకు సహకరిస్తానని, కోర్టు షరతులకు కట్టుబడి ఉంటానని అందువల్ల ముందస్తు బెయిలు మంజూరు చేయాలని కోరారు. కాగా, ఈ పిటిషన్పై ఈ నెల 14న హైకోర్టు విచారణ చేపట్టనుంది.
