
- పీవోకేలో ఉంటున్నది మనవాళ్లే.. మనమంతా ఒకే ఫ్యామిలీ
- ఢిల్లీలో సీఐఐ బిజినెస్ సమిట్లో రక్షణ మంత్రి కామెంట్స్
న్యూఢిల్లీ: పీవోకేలో ఉన్నవాళ్లంతా మనవాళ్లే అని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. అందరం ఒకే కుటుంబానికి చెందినవాళ్లమని తెలిపారు. పీవోకే ఇండియాలో భాగమని స్పష్టం చేశారు. అక్కడున్న వారికి ఇండియాతో మంచి సంబంధాలున్నాయని అన్నారు. వాళ్లంతా స్వచ్ఛందంగా ఇండియాకు తిరిగి వచ్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయని తెలిపారు.
సీఐఐ బిజినెస్ సమిట్కు హాజరైన రాజ్నాథ్ సింగ్.. పీవోకేతో పాటు ఆపరేషన్ సిందూర్పై సంచలన కామెంట్లు చేశారు. ‘‘పీవోకే.. ఇండియాలో విలీనం కావడం అనేది సాంస్కృతిక, సామాజిక, ఆర్థిక శ్రేయస్సుపై ఆధారపడి ఉంటుంది. పీవోకే కోసం చాలా చేశాం. విపత్కర పరిస్థితులు ఎదురైనా.. దీటుగా ఎదుర్కొని సంయమనం పాటించాం.
పీవోకే స్వాధీనం చేసుకోవడానికి మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. దానంతట అదే తిరిగి వస్తుంది. ఏదో ఒకరోజు పీవోకే మనదే అవుతుంది. భౌగోళికంగా విడిపోయినా.. పీవోకే ప్రజలు రాజకీయంగా త్వరలోనే ఇండియాకు తిరిగి వచ్చేస్తారు. ‘ఏక్ భారత్.. శ్రేష్ఠ్భారత్’ అనే సంకల్పానికి కట్టుబడి ఉన్నాం. పీవోకేలో ఉన్నవాళ్లలో కొంతమంది మాత్రమే తప్పుడు దారి ఎంచుకున్నారు’’ అని రాజ్నాథ్ సింగ్ అన్నారు.
హనుమంతుడి సిద్ధాంతాన్ని అనుసరించినం
ఆపరేషన్ సిందూర్ ద్వారా దేశభద్రతకు మేకిన్ ఇండియా ముఖ్యమని ప్రూవ్ అయిందని రాజ్నాథ్ సింగ్ అన్నారు. ‘‘మనం ఇప్పుడు ఫైటర్ జెట్లు, మిసైల్ సిస్టమ్స్ను డెవలప్ చేయడంతోపాటు కొత్త సాంకేతికతలపై దృష్టిపెట్టాం. ఆపరేషన్ సిందూర్లో వాడిన చాలా ఆయుధాలు.. సొంతంగా తయారు చేసుకున్నవే.
మన ఆయుధాల పనితీరు చూసి ప్రపంచం ఆశ్చర్యపోయింది. అశోకవనంలో హనుమంతుడు అనుసరించిన సిద్ధాంతాన్ని మనమూ అనుసరించాం. అమాయకుల ప్రాణాలు తీసినవాళ్లనే లక్ష్యంగా చేసుకుని దాడి చేశాం. ఆపరేషన్ సిందూర్ ద్వారా ఇండియన్ ఆర్మీ.. దేశ ప్రజలను గర్వించేలా చేసింది.
గడిచిన పదేండ్లలో ఇండియా డిఫెన్స్ సెక్టార్ కొత్త శిఖరాలను అధిరోహించింది. డిఫెన్స్ ప్రొడక్ట్స్ ఉత్పత్తి.. 2014లో రూ.43,746 కోట్లుంటే.. ఇప్పుడు రూ.1.46 లక్షల కోట్లకు చేరుకున్నది’’అని రాజ్నాథ్ సింగ్ అన్నారు. పాకిస్తాన్తో ఇకపై చర్చలు కేవలం టెర్రరిజం, పీవోకే అంశాలపై మాత్రమే ఉంటాయన్నారు.