- 36.6 తులాల బంగారం, 4 కేజీల వెండి, కారు, ల్యాప్ ట్యాప్ స్వాధీనం
అల్వాల్, వెలుగు: తాళం వేసి ఉన్న ఇండ్లను టార్గెట్గా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న ఓ ముఠాను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. గురువారం అల్వాల్ పోలీస్ స్టేషన్లో విలేకరులకు పేట్ బషీరాబాద్ ఏసీపీ కే. రాములు తెలిపిన వివరాల ప్రకారం.. నేరేడ్మెట్ ప్రాంతానికి చెందిన బండి విజయ్ కుమార్ (28), కుషాయిగూడ ప్రాంతంలో ఉండే కృష్ణ వంశీ (26), అల్వాల్ లో ఉండే చిగుర్ల సతీశ్ (30) పరారీలో ఉన్న తేజ, శ్రవణ్లను నిందితులుగా గుర్తించినట్లు తెలిపారు.
వీరు అద్దెకు కారు తీసుకుని దొంగతనాలు చేస్తున్నారు. ఇంటిరీయర్ విజయ్ కుమార్, గతంలో అమెజాన్లో పని చేసిన కృష్ణవంశీకి వివిధ ప్రాంతాలకు చెందిన కాలనీల మీద పూర్తి పట్టు ఉంది. డ్రైవర్ సతీశ్ దొంగతనం చేయాలనుకున్న ఇంటికి దూరంలో కారును పెట్టేవాడు. మిగతా ఇద్దరు ఇండ్ల డోర్లు మిషన్తో కట్ చేసి దొంగతనానికి పాల్పడ్డారు. గత నవంబర్లో కుషాయిగూడ చర్లపల్లి, జవహర్ నగర్, అల్వాల్ ప్రాంతాల్లో మొత్తం అయిదు ఇండ్లలో దొంగతనం చేశారు.
బాధితుల ఫిర్యాదుతో.. వెలుగులోకి
అల్వాల్ పట్టణ పరిధిలోని ప్రశాంత్నగర్లో నివసించే విక్రమ్ తేజ ఈ నెల 16న తమ ఇంటి తాళం పగలగొట్టి దొంగతనానికి పాల్పడ్డారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 21న మచ్చ బొల్లారంలో విజయ్ కుమార్, కృష్ణ వంశీ, సతీశ్ అనుమానాస్పదంగా కనిపించారు. దీంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. నిందితుల నుంచి దాదాపు 32.6 తులాల బంగారు ఆభరణాలు, నాలుగు కేజీల వెండి ఆభరణాలు, ఒక ల్యాప్ ట్యాప్, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. డీసీపీ నరసింహారావు పర్యవేక్షణలో అల్వాల్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ కేసును దర్యాప్తు చేస్తున్నారు.