
- ఇద్దరు నిందితుల అరెస్టు
ఘట్ కేసర్, వెలుగు: పర్సనల్ ఫొటోలు వైరల్ చేస్తామని యువతిని బ్లాక్ మెయిల్ చేసిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం ఈ ఘటన జరిగింది. ఇన్ స్పెక్టర్ సైదులు వివరాల ప్రకారం.. రియాజ్ అలీ అనే వ్యక్తి తన మొబైల్ను పట్టణంలోని శాంతినగర్కు చెందిన జ్ఞానేశ్వర్ వద్ద తాకట్టు పెట్టాడు.
రియాజ్ ఫోన్ లాక్ను ఓపెన్ చేసిన జ్ఞానేశ్వర్.. అతని స్నేహితురాలితో ఉన్న పర్సనల్ ఫొటోలను వాట్సాప్ ద్వారా తన మిత్రుడు హేమంత్కు పంపించాడు. అనంతరం ఇద్దరు కలిసి ఈ ఫొటోలను సదరు యువతికి పంపించి వైరల్ చేస్తామని బ్లాక్ మెయిల్ చేశారు. దీంతో ఆందోళనకు గురైన బాధితురాలు ఘట్కేసర్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.