10మంది ఫారెస్ట్​ ఆఫీసర్లపై కేసు..

10మంది ఫారెస్ట్​ ఆఫీసర్లపై కేసు..

పెనుబల్లి, వెలుగు: హైకోర్టు ఉత్తర్వులు ఉల్లంఘించి ప్రైవేట్​ భూమిలో ప్రవేశించినందుకు  పదిమంది అటవీశాఖ ఆఫీసర్లపై పోలీస్​ కేసు నమోదైంది. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కొత్తలంకపల్లి గొల్లగూడెం రెవెన్యూ లోని 129/1 సర్వే నెంబర్​లో   సోమరాజు జైకాంత్​ అనే వ్యక్తి పేరు మీద ఎకరం వ్యవసాయ భూమి ఉంది. ఇది వారసత్వ భూమిగా రికార్డుల్లో కన్పిస్తోంది.  అయితే ఆ భూమి తమ ఆధీనంలో ఉన్నట్లు అటవీశాఖ ఆఫీసర్లు ఫెన్సింగ్​ వేసి బోర్డు ఏర్పాటు చేశారు.  దీన్ని సవాల్​ చేస్తూ హైకోర్టులో  జైకాంత్ పిటిషన్​ వేశారు. ఆ భూమి ప్రైవేట్​వ్యక్తికి చెందిన భూమిగా ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చింది.  హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి అటవీశాఖ ఆఫీసర్లు భూమిని  ఖాళీ చేయకపోవడంతో వారిపై  వీఎం బంజర్​ పోలీసులకు  జైకాంత్ ఫిర్యాదు చేశారు.  దీంతో పదిమంది అటవీశాఖ ఆఫీసర్లపై సెక్షన్​103 కింద పోలీసులు కేసు నమోదు చేశారు.